Nalgonda: శిశు విక్రయానికి డాక్టర్‌ మధ్యవర్తిత్వం

Eenadu icon
By Crime News Desk Updated : 30 Oct 2025 05:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విచారణలో మరో వ్యవహారం వెలుగులోకి
రూ.4.50 లక్షలకు మగ శిశువు అమ్మకం
మొత్తం ఏడుగురి అరెస్టు: ఎస్పీ శరత్‌చంద్ర

ఈనాడు, నల్గొండ; నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: శిశువుల విక్రయాల వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నల్గొండ పోలీసులు రెండు రోజుల నుంచి ఆడ శిశువు విక్రయంపై ముమ్మర దర్యాప్తు చేస్తుంటే ఇంకో మగ శిశువు విక్రయ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. వారి నుంచి రూ.20 వేల నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లు, ఒప్పంద పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలివీ... 

కుర్ర బాబు, భార్య పార్వతి ప్రస్తుతం నల్గొండ బీటీఎస్‌లో నివాసం ఉంటున్నారు. ఐదోసారి గర్భం దాల్చిన పార్వతిని.. బాబు హాలియాలోని నిర్మల ఆసుపత్రిలో చేర్చారు. ఈసారి కూడా ఆడ శిశువు పుట్టడంతో పోషించలేమని బాబు.. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు శాంతిప్రియ దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె మధ్యవర్తిత్వం వహించి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి, రజిత దంపతులకు సమాచారం అందించారు. వారు రూ.2.30 లక్షలకు బేరం కుదుర్చుకుని శిశువును తీసుకెళ్లారు. సాంబమూర్తి ఏలూరులో వార్డు ఎమినిటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కుర్ర బాబును, ఈ దంపతులను రిమాండ్‌కు తరలించారు. డాక్టర్‌ శాంతిప్రియను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేశారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చేసి ఆమె ఈ సెప్టెంబరు నుంచి హాలియాలోని నిర్మల ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

నల్గొండ కేసును విచారిస్తున్న సమయంలో ఓ మగ శిశువును రూ.4.50 లక్షలకు విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఒర్సు శ్రీను, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ఆరేళ్ల క్రితం ఒడిశాలో మట్టి పనికి వెళ్లిన అతను అక్కడ మమత అనే మహిళను రెండో వివాహం చేసుకోగా వారికి ఒక పాప పుట్టింది. రెండోసారి ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో మమతను సొంత గ్రామానికి తీసుకొచ్చాడు. పుట్టబోయే బిడ్డను విక్రయించాలని కనగల్‌ మండలం బొమ్మాయిపల్లికి చెందిన స్నేహితుడు శ్రీనుకు చెప్పాడు. దీంతో అతడు అదే గ్రామానికి చెందిన పిల్లలు లేని వేముల నాగరాజు, సువర్ణ దంపతులకు సమాచారం ఇచ్చాడు. ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో మమతకు మగ శిశువు జన్మించాడు. ఈ నెల 15న శిశువును రూ.6 లక్షలకు అమ్మకానికి పెట్టి రూ.4.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని నగదుతో ఒడిశాకు వెళ్లారు. శిశువును కొన్న నాగరాజు, సువర్ణలతోపాటు మధ్యవర్తి శ్రీనును రిమాండ్‌కు తరలించారు.

Tags :
Published : 30 Oct 2025 05:04 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని