logo

కేసీఆర్‌ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస

సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్‌ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 01:19 IST

జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి అజయ్‌, ఎమ్మెల్సీ మధుసూదన్‌ తదితరులు

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్‌ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తొలుత భారాస జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. కొంతమంది కేసీఆర్‌ చరిత్రను మరుగున పడేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అది సాధ్యంకాదన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారన్నారు. రాష్ట్ర సాధనకు, హక్కుల కోసం, ప్రజల కోసం మొక్కవోని పోరాటం చేసిన కేసీఆర్‌ను ప్రజలెప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్‌ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ... ఎన్నికలకు 15 రోజుల సమయముందని, దీన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకొని భారాస గెలుపునకు కృషి చేయాలన్నారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ... రైతుబిడ్డగా మరోసారి పోటీ చేస్తున్న మీవాణ్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు లోక్‌సభలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేశానన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జిల్లాలోని ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్‌ల అభివృద్ధికి నిధులు విడుదల చేసుకున్నామని, అనేక జాతీయ రహదారులను సాధించుకున్నామని వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ మాట్లాడుతూ... జిల్లా ఎల్లలు తెలియనివాళ్లను గెలిపించుకుంటే అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. నాయకులు కొండబాల కోటేశ్వరరావు, వెంకటరమణ, రాంమూర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ రోడ్‌షోను విజయవంతం చేయండి: అజయ్‌

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఖమ్మంలో సోమవారం(29న) జరిగే రోడ్‌షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రఘునాథపాలెం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన తన నివాసంలో శనివారం సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం, రోడ్‌షో వంటి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీరా ఈరూ నాయక్‌, మాదంశెట్టి హరిప్రసాద్‌, మెంటెం రామారావు, భూక్యా లక్ష్మణ్‌నాయక్‌, నాగండ్ల భద్రయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని