logo

పార్టీలకతీతంగా అభివృద్ధి: ఎంపీ

ప్రతి పల్లె, పట్టణంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ అన్నారు. శుక్రవారం అందోలు మండలం  సంగుపేటలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి పాల్గొన్నారు.

Published : 10 Jun 2023 01:47 IST

ఆర్థిక సాయం మంజూరు పత్రం అందజేస్తున్న ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌,
చిత్రంలో కలెక్టర్‌ శరత్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ

జోగిపేట, వట్‌పల్లి: ప్రతి పల్లె, పట్టణంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ అన్నారు. శుక్రవారం అందోలు మండలం  సంగుపేటలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి పాల్గొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం గొర్రెల పథకం, బీసీలకు సాయం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురపాలక అధ్యక్షుడు మల్లయ్య, ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, భారాస నాయకులు జైపాల్‌రెడ్డి, జడ్పీ సీˆఈవో ఎల్లయ్య, పశు సంవర్ధక శాఖ జేడీ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వట్‌పల్లి మండలం దేవునూర్‌ రైతువేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ప్రారంభించారు.


గడపగడపకు సంక్షేమ ఫలాలు

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ పాలనలో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నియోజకవర్గ స్థాయి సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, సీడీసీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు చెక్కు పంపిణీ చేస్తున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

జిన్నారం: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిన్నారం మండలానికి చెందిన 57 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, బీసీ కుల వృత్తులకు చెందిన ముగ్గురికి రూ.లక్ష సాయం చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, తహసీల్దార్‌ దశరథ్‌సింగ్‌, నాయకులు ప్రకాశంచారి, వెంకటేశంగౌడ్‌, రాజేశ్‌, రామకృష్ణ వెంట ఉన్నారు.


ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి

ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి గొర్రె పిల్ల అందజేస్తున్న కురుమ సంఘ నాయకులు

నారాయణఖేడ్‌: ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుతోందని ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఖేడ్‌ మండలం జూకల్‌ శివారులో వివిధ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన ‘సంక్షేమ సంబురాలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖేడ్‌ నియోజకవర్గంలో తొమ్మిదేళ్లలో ఆసరా పింఛన్ల కింద రూ.487.72 కోట్లు పంపిణీ చేశామన్నారు. 100 మందికి దళితబంధు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. డీపీవో సురేష్‌ మోహన్‌, ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.


కుల వృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం

యాదవులతో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కృల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారని, ఇప్పటికే దళితబంధు అమలు చేశారన్నారు. బీసీల్లోని కులవృత్తుల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వివరించారు. డీఆర్‌డీవో జయదేవ్‌, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని