logo

చిట్టితల్లి వేడుక చూడకుండానే..

అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి.

Published : 24 Apr 2024 03:53 IST

కారు ఢీకొని తండ్రి దుర్మరణం, చిన్నాన్నకు తీవ్ర గాయాలు

బోయిన కాశయ్య (పాత చిత్రం)

 మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. చేయి పట్టి నడిపించిన నాన్నను విగత జీవిగా చూసిన ఆ చిన్నారి గుండెలవిసేలా రోదించడం అక్కడివారిని కలచివేసింది. ఈ విషాద సంఘటన రాయవరం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కొనకనమిట్ల మండలం గుర్రాలమడుగుకు చెందిన బోయిన కాశయ్య (40), బోయిన కృష్ణ అన్నదమ్ములు. కాశయ్య కుమార్తె వీరమ్మ పుష్పాలంకరణ వేడుక బుధవారం నిర్వహించ తలపెట్టారు. అందుకు సంబంధించిన సామగ్రి తీసుకొచ్చేందుకు అన్నదమ్ములు కాశయ్య, కృష్ణ మంగళవారం మార్కాపురం పట్టణానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పనులు ముగించుకుని వస్తుండగా, రాయవరం సమీపంలో హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో  కాశయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తమ్ముడు కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుని భార్య, కుటుంబ సభ్యులు సంఘటన ప్రాంతానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని వారు 565 జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మార్కాపురం గ్రామీణ ఎస్సై వెంకటేశ్వరనాయక్‌ అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. కారు చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని