logo

కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి

పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

Published : 23 Apr 2024 03:34 IST

మోసపోయిన మహిళ ఆత్మహత్య

తోయా జాక్సి  

పటాన్‌చెరు అర్బన్‌, హరిపురం (మందస), న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ పటాన్‌చెరు ఠాణా పోలీసులు వివరాల ప్రకారం..మందస మండలం మకరజోలకు చెందిన తోయాజాక్సి(25) పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఓ పరిశ్రమలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తుంది. ఇస్నాపూర్‌లో ప్రైవేటు వసతి గృహంలో ఉంటుంది. 2021లో భిలాయ్‌కు చెందిన విజయ్‌తో వివాహమైంది. సువర్ణపురానికి చెందిన కిరణ్‌కుమార్‌ ‘నిన్ను ప్రేమించాను.. నీ భర్తకు విడాకులు ఇచ్చి వేస్తే పెళ్లి చేసుకుంటాను’ అని రోజూ ఫోన్‌ చేస్తుండే వాడు. ఇది నమ్మిన తోయాజాక్సి భర్త విజయ్‌కు 2023లో విడాకులిచ్చింది. తరువాత పెళ్లి చేసుకోమని కిరణ్‌కుమార్‌ను అడగ్గా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవటం లేదు.. తనకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని మాట మార్చాడు. దీంతో ఈనెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె సహోద్యోగి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కిరణ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పదో తరగతి ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థిని..

వజ్రగడ్డి జానకి

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కోటబొమ్మాళి మండలంలో చోటుచేసుకుంది. సీతారాంపురానికి చెందిన వజ్రగడ్డి సరోజనమ్మ భర్త రాజారావు అనారోగ్యంతో ఏడేళ్ల కిందట మృతి చెందాడు. అప్పటి నుంచి కన్నవారి గ్రామం సీతారాంపురంలోనే ఉంటూ కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె మంజులత డిగ్రీ చదువుతుండగా రెండో పాప వజ్రగడ్డి జానకి   పదో తరగతి చదివింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్ట్‌లో తప్పింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి సరోజనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై షేక్‌ మీర్‌మహమ్మద్‌ తెలిపారు.


నిద్రలో డాబా పైనుంచి జారిపడి ఆర్‌ఎంపీ మృత్యువాత

బి.చంద్రశేఖర్‌

మందస, న్యూస్‌టుడే: డాబాపై నిద్రిస్తూ జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మందస మండలం బైరిసారంగిపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మందస పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నం మండలం గంగువాడకు చెందిన బొడ్డు చంద్రశేఖర్‌ (50) ఆర్‌ఎంపీగా పని చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. శనివారం డాబాపై నిద్రించి, మత్తులో జారి పడి మృతి చెందారు. రెండు రోజుల నుంచి అతను కనిపించకపోవడం, దుర్వాసన రావడంతో గ్రామస్థులు సోమవారం ఇంటి పైనుంచి చూశారు. విగతజీవిగా చంద్రశేఖర్‌ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.అనిల్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని