logo

విజయ్‌ పుట్టినరోజున గోట్‌ రెండో సింగిల్‌

విజయ్‌ 68వ చిత్రంగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌) రూపొందుతున్న విషయం తెలిసిందే.

Published : 29 Apr 2024 00:14 IST

చిత్రంలో ఓ సన్నివేశం

చెన్నై: విజయ్‌ 68వ చిత్రంగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌) రూపొందుతున్న విషయం తెలిసిందే. జయరామ్‌, ప్రభుదేవా, మోహన్‌, ప్రశాంత్‌, వైభవ్‌, స్నేహ, లైలా తదితర నటీనటులతో మల్టీ స్టారర్‌ చిత్రంగా తెరకెక్కుతోంది. చిత్రం తొలి సింగిల్‌ ‘విజిల్‌ పోడు’ పాట కొన్ని వారాల కిందట విడుదలై అభిమానుల నుంచి విశేష స్పందన పొందింది. అత్యధిక లైక్‌, వీక్షణల రికార్డును నెలకొల్పింది. ఈ నేపథ్యంలో చిత్రం రెండో సింగిల్‌ను విజయ్‌ పుట్టినరోజైన జూన్‌ 22న విడుదల చేయనున్నట్టు దర్శకుడు వెంకట్‌ ప్రభు ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 5న సినిమా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.


‘సూదు కవ్వుం-2’ బృందానికి అభినందనలు

సినిమా పోస్టరు

చెన్నై, న్యూస్‌టుడే: నలన్‌ కుమారసామి దర్శకత్వంలో 2013లో విడుదలై విజయం సాధించిన చిత్రం ‘సూదు కవ్వుం’. చిత్రంలో విజయ్‌ సేతుపతి, సంజితా శెట్టి, అశోక్‌ సెల్వన్‌, బాబి సింహా, రమేశ్‌ తిలక్‌, కరుణాకరన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్రం సీక్వెల్‌గా ‘సూదు కవ్వుం-2’ రూపొందింది. ఎం.ఎస్‌.అర్జున్‌ దర్శకత్వంలో మిర్చి శివ కథానాయకుడిగా నటించారు. సినిమా ట్రైలర్‌, పాటలు కొన్ని వారాల కిందట విడుదలై సినీ అభిమానుల ఆదరణ పొందాయి. త్వరలో చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎం.ఎస్‌.అర్జున్‌, ఛాయాగ్రాహకుడు కార్తిక్‌ తిల్లైను నటుడు విజయ్‌ సేతుపతి తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు.


స్టార్‌ ట్రైలర్‌కు ప్రశంసలు

చెన్నై: ఇళన్‌ దర్శకత్వంలో కవిన్‌ నటించిన ‘స్టార్‌’ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీ రంగ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైలర్‌ను చూసిన వెంటనే చిత్రాన్ని చూడాలన్న ఉత్సాహం కలుగుతోందని ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తెలిపారు. సన్నివేశాలు, చిత్రీకరణ విధానం వంటివి ఆకర్షించాయని, ఇదొక మంచి చిత్రంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. నటుడైన మంత్రి ఉదయనిధి కూడా ట్రైలర్‌ను చూసి చిత్రబృందాన్ని అభినందించారు.


మే 1న దీన రీ రిలీజ్‌

సినిమాలో ఓ సన్నివేశం

చెన్నై: ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో అజిత్‌కుమార్‌, లైలా, సురేశ్‌ గోపి ముఖ్య తారాగణంగా 2001లో విడుదలైన చిత్రం ‘దీన’. అజిత్‌కుమార్‌కు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ చిత్రం విడుదలై 23 ఏళ్లయిన నేపథ్యంలో డిజిటల్‌ ముద్రణలో సినిమాను రీ రిలీజ్‌ చేయనున్నారు. అజిత్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా మే 1న రీ రిలీజ్‌ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించారు. ఇదే రోజు అజిత్‌ చిత్రాలైన ‘బిల్లా’, ‘మంగాత్త’ చిత్రాలూ రీ రిలీజ్‌ కానుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని