logo

‘విద్యాకానుక’ సకాలంలో అందేనా?

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికల్లా విద్యార్థులందరికీ ‘విద్యాకానుక’ కిట్లు నూరు శాతం పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Published : 09 Jun 2023 05:43 IST

ఇంకా  పూర్తిగా సరఫరా కాని పాఠ్యపుస్తకాలు

స్టాక్‌ పాయింట్‌లో భద్రపరిచిన పాఠ్యపుస్తకాలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికల్లా విద్యార్థులందరికీ ‘విద్యాకానుక’ కిట్లు నూరు శాతం పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. బడుల ప్రారంభం రోజే 9 రకాల వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ దిశగా సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా వస్తువులను ఆయా మండల స్టాక్‌ పాయింట్లకు సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దిగుమతి చేయలేకపోతున్నారు.

జిల్లాలో తొలుత నిఘంటువులను దిగుమతి చేశారు. ఆ తర్వాత ఇతర వస్తువుల దిగుమతి మందకొడిగా సాగింది. పలురకాల కారణాలతో కొన్ని రకాలకు జాప్యం ఏర్పడింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కొన్ని తరగతుల సిలబస్‌ మారడంతో పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. ఫలితంగా వాటి సరఫరాలో జాప్యం నెలకొంది. వర్క్‌ బుక్‌ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు 71 శాతం, వర్క్‌ బుక్‌లు 66 శాతం  దిగుమతయ్యాయి. మిగతావి ఒకటి రెండు రోజుల్లో రానున్నాయని సీఎంవో రవీంద్ర తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వివిధ రకాల వస్తువులను ఆయా మండల స్టాక్‌ పాయింట్లకు సరఫరా చేసి భద్రపరుస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా స్కూలు పాయింట్లకు తరలిస్తున్నారు. గతంలో మండల పాయింట్ల నుంచి ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు తీసుకెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు నేరుగా పాఠశాలలకు పంపిస్తుండటం కొంత ఉపశమనం కలిగించే అంశం.

ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి 14,256 దరఖాస్తులు

నూజివీడు న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ(రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం విదితమే. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 14,256 దరఖాస్తులు అందినట్లు ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్‌ గోపాలరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని