Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jul 2023 21:01 IST

1. చిన్నారుల అక్రమ రవాణా.. టాప్‌-3లో ఆంధ్రప్రదేశ్‌

చిన్నారుల అక్రమ రవాణాలో (Child trafficking) బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2016-22 మధ్యకాలంలో పిల్లల అక్రమ రవాణా కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే అధికంగా వెలుగు చూసినట్లు తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే రాజస్థాన్‌లో జైపుర్‌ సిటీ తొలిస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ఆరో స్థానంలో నిలిచింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు రూట్‌ మ్యాప్‌ ఖరారు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) రూట్‌ మ్యాప్‌ ఖరారైది. ఆగస్టు ఒకటో తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న ఆయన.. మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అదే రోజు నందికొట్కూరులో రోడ్‌ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మిషన్‌ కాకతీయను కమీషన్ల కాకతీయగా మార్చేశారు: డీకే అరుణ

రాష్ట్రంలో మిషన్‌ కాకతీయను కమీషన్ల కాకతీయగా మార్చారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. వరద బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకం పనులు చేపట్టారని దుయ్యబట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘నీతీశ్‌ మావాడే’...కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(RPI) అధినేత రామ్‌దాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండియా కూటమిలో విపక్షాలను ఏకతాటిపైకి తీసురావడంలో కీలక పాత్ర పోషించిన బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తమవాడేనని, ఏ సమయంలోనైనా ఆయన ఎన్డీయేలోకి వచ్చేస్తారని అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెదేపాను గెలిపిస్తే.. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతాం: లోకేశ్‌

తెలుగు దేశానికి పట్టం కడితే అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు.  ప్రజా సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్‌.. తనపై బీసీ నాయకులతో మాటల దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆడియో వైరల్‌పై వైకాపా ఎమ్మెల్యే వివరణ.. ఎవరా మహిళ? ఏంటా డీల్‌?

ఓ మహిళతో కర్నూలు వైకాపా ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడిన ఆడియో సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ స్పందించారు. ఆదివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఓ మహిళతో మాట్లాడింది వాస్తవమేనని, అందులో అసభ్యకరంగా ఏముందని ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విశాఖ రుషికొండ బీచ్‌లో టూరిస్ట్‌ బోటు బోల్తా..

విశాఖ రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కావడంతో సముద్రంలో విహరించేందుకు పలువురు పర్యాటకులు టూరిస్ట్ బోటు ఎక్కారు. కొంతదూరం వెళ్లిన అనంతరం బోటు బోల్తా పడింది. పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో డ్రైవర్ సహా రవి, సురేష్ అనే ఇద్దరు టూరిస్ట్‌లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా పరిస్థితే ఇలా ఉంటే .. సాధారణ ప్రజల సంగతేంటి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

రెండు నెలలు గడిచినప్పటికీ పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ చేయకపోవడం పట్ల గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 25న తను.. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఎమ్మెల్యే అయిన తనకే ఈ పరిస్థితి ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎందుకు వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ చేయడం లేదని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రేపే లాస్ట్‌.. 6 కోట్లు దాటిన ఐటీ రిటర్నులు

ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు(ITRs) దాఖలు చేసేందుకు గడువు ఇంకా ఒక్కరోజే ఉండటంతో రిటర్నులు సమర్పించేందుకు పన్నుచెల్లింపుదారులు ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌కు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఐటీశాఖ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్‌ కాగా.. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో లాగిన్‌ అయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విషమంగానే బుద్ధదేవ్‌ భట్టాచార్య ఆరోగ్యం.. వెల్లడించిన వైద్యులు

తీవ్ర అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన పశ్చిమబెంగాల్‌ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. శనివారం నుంచి అదే ప్రమాదకర పరిస్థితి కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు