Prajwal Revanna: ప్రజ్వల్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. బెంగళూరు రాగానే అరెస్టు?

లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రజ్వల్‌  ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన స్వదేశానికి రాగానే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated : 29 May 2024 20:20 IST

Prajwal Revanna | బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.  ప్రజ్వల్‌ తరఫు న్యాయవాది అరుణ్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. మరోవైపు, మ్యూనిచ్‌ నుంచి  ప్రజ్వల్‌ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 31న ఆయన బెంగళూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే పడింది.  విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మోదీజీ.. మీకు గుడి కట్టిస్తా.. డోక్లా ప్రసాదం పెడతా: మమతా బెనర్జీ

అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని.. మే 31న ఉదయం 10 గంటలకు సిట్‌ ఎదుట హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ  సోమవారం విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 

మరోవైపు, తనపై నమోదైన కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్‌ తరఫు న్యాయవాది ఆమెకు ముందస్తు బెయిల్‌పై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసులో ఆమె భర్త హెచ్‌.డి.రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భవానీకి ముందస్తు బెయిల్‌పై తీర్పును మే 31కి రిజర్వు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని