S Jaishankar: ‘ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం’.. బాధిత కుటుంబాలను కలిసిన జైశంకర్‌

S Jaishankar: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన నేవీ మాజీ అధికారుల కుటుంబాలను జైశంకర్‌ పరామర్శించారు. ఈ కేసుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.

Updated : 30 Oct 2023 20:35 IST

దిల్లీ: ఖతార్‌ (Qatar)లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులను (Ex-Navy Officers) విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. సోమవారం ఆ బాధిత అధికారుల కుటుంబసభ్యులను కలిసిన ఆయన.. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ విషయాన్ని జైశంకర్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో వెల్లడించారు.

‘‘ఖతార్‌ నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు వారికి తెలియజేశా. ఆ కుటుంబాల ఆవేదన, ఆందోళన మాకు అర్థమవుతోంది. వారి విడుదలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధిత అధికారుల కుటుంబసభ్యులకు తెలియజేస్తాం’’ అని జైశంకర్‌ రాసుకొచ్చారు.

గూఢచర్యం ఆరోపణలపై ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్‌ కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రైవేటు భద్రతా సంస్థ అల్‌ దహ్రాలో పనిచేస్తున్న వీరిని గతేడాది ఆగస్టులో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాల కేసులో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది.

8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్ష

ఉగ్రవాదానికి మనం అతిపెద్ద బాధితులం..

ఉగ్రదాడులకు భారత్‌ అతిపెద్ద బాధిత దేశమని, అందుకే ఉగ్రవాదాన్ని మనం బలంగా వ్యతిరేకిస్తున్నామని జైశంకర్‌ (S Jaishankar) అన్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో హమాస్‌ దాడిని ప్రస్తావించకపోవడమే భారత్‌ గైర్హాజరీకి కారణమైంది. అయితే, దీనిపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ టౌన్‌హాల్‌ సమావేశంలో జైశంకర్‌ మాట్లాడుతూ.. ఆ తీర్మానంపై భారత వైఖరి గురించి ప్రస్తావించారు. ‘‘మంచి, సమర్థమంతమైన ప్రభుత్వం తమ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. స్వదేశంలో సుపరిపాలన ఎంత అవసరమో.. విదేశీ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉగ్రవాదానికి మనం అతిపెద్ద బాధితులం. అందుకే.. ఉగ్రవాదంపై మన వైఖరి బలంగా ఉంటుంది. ఉగ్రవాదం వల్ల మనం నష్టపోయినప్పుడు మాత్రమే అది తీవ్రమైన అంశమని, ఇతరులకు అలా జరిగినప్పుడు తీవ్రమైన అంశం కాదని చెబితే మనపై విశ్వసనీయత ఉండదు. ఇలాంటి అంశాలపై మన వాదన ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి’’ అని జైశంకర్‌ అన్నారు.

వారిని విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు: నౌకాదళ చీఫ్

గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణ శిక్ష పడిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ ఉద్యోగులను విడిపించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని నౌకాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ వెల్లడించారు. ఈ కేసులో కోర్టు విచారణకు సంబంధించిన పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘గోవా మారిటైమ్‌ కాంక్లేవ్‌’ కార్యక్రమంలో భాగంగా అడ్మిరల్‌ హరికుమార్‌ ఈ మేరకు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని