ఎందుకీ ‘ప్రత్యేకం’!

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది.

Updated : 18 Sep 2023 08:48 IST

పార్లమెంటు సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ
గతంలోనూ 7 సార్లు ప్రత్యేక భేటీలు
రాజ్యాంగంలో లేని ‘ప్రత్యేకం’ ప్రస్తావన
కేబినెట్‌ కమిటీ నిర్ణయంతో ఎప్పుడైనా నిర్వహించే వెసులుబాటు

దిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం వెల్లడించినా అంతకు మించి ఏదో ఉందనే అందరూ భావిస్తున్నారు. అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి.. ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనేది అత్యంత ఆసక్తిగా మారింది. సమావేశాలపై ఆగస్టు 3వ తేదీన ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎన్నో ఊహాగానాలు..

ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలపై ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తొలుత ఎజెండా గురించి ప్రకటనలేమీ లేకపోవడంతో స్వయంగా సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారు. దీంతో గత బుధవారం తాత్కాలిక ఎజెండాను ప్రకటించింది. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. వీటిని ప్రధాన ప్రతిపక్షం నమ్మడం లేదు. చివరి నిమిషంలో ఏవో బాంబులను పేల్చే అవకాశముందని అంటోంది.

  • గతంలో సమావేశాలకు కొన్ని రోజుల ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎజెండాను వివరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి 18న సమావేశాలుంటే 17నే అఖిల పక్షాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
  • సాధారణంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను జాతీయ ప్రాధాన్యమున్న కార్యక్రమాలకు, మైలురాళ్ల సాధన సమయంలో నిర్వహిస్తారు.
  • 2008లో లెఫ్ట్‌ పార్టీలు మన్మోహన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో బల నిరూపణ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఒక్క రోజు ఏర్పాటు చేశారు.
  • 2017లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
  • రెండు సార్లు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక క్యాలెండర్‌ ఏమీ లేదు

పార్లమెంటు సమావేశాలకు ప్రత్యేక క్యాలెండర్‌ అంటూ ఏమీ లేదు. 1955లో లోక్‌సభ కమిటీ బడ్జెట్‌ సమావేశాలకు తేదీలను సూచించింది. ఫిబ్రవరి 1నుంచి మే 7వ తేదీ మధ్యలో నిర్వహించాలని పేర్కొంది. వర్షాకాల సమావేశాలను జులై 15, సెప్టెంబరు 15 మధ్య నిర్వహించాలని సూచించింది. శీతాకాల సమావేశాలను నవంబరు 5 నుంచి గానీ, దీపావళి ముగిసిన నాలుగో రోజు నుంచి గానీ ప్రారంభించాలని పేర్కొంది. డిసెంబరు 22లోగా ముగించాలని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం రెండు పార్లమెంటు సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదు.


జాతీయ ప్రాధాన్యమున్న సందర్భాల్లోనే..

జాతీయ ప్రాధాన్యమున్న సందర్భాల్లో ఈ సమావేశాలను నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రశ్నోత్తరాల సమయాన్ని వదిలేస్తారు. అత్యవసర పరిస్థితిని నిర్వచించే ఆర్టికల్‌ 352 సభ ప్రత్యేక భేటీకి అవకాశమిస్తుంది.


ప్రత్యేక సమావేశాలంటే..

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారమిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్రత్యేక సమావేశాలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పేరుతో ఎంపీలకు ఆహ్వానం వెళ్తుంది. అయితే ‘ప్రత్యేక సెషన్‌’ అని రాజ్యాంగంలో లేదు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 85(1) నిబంధనల ప్రకారం.. ఈ సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు.


7 సార్లు..

ఇప్పటిదాకా 7 సార్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఇందులో మూడు జాతీయ ప్రాధాన్యమున్న సందర్భాల్లో నిర్వహించినవి. రెండు రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. మిగిలిన వాటిలో ఒకటి విశ్వాస పరీక్షకు, ఇంకోటి జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం జరిపినవి.


  • 1977: తమిళనాడు, నాగాలాండ్‌లలో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు రాజ్యసభ ప్రత్యేకంగా సమావేశమైంది.
  • 1991: హరియాణాలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రెండు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగాయి.
  • 1992: క్విట్‌ ఇండియా ఉద్యమ 50వ దినోత్సవం కోసం ఆగస్టు తొమ్మిదో తేదీన అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేకంగా  సమావేశమైంది.
  • 1997: భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల కోసం ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 వరకూ సమావేశాలు జరిగాయి.
  • 2008: లెఫ్ట్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్ష కోసం మన్మోహన్‌ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
  • 2015: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకల కోసం సభ ప్రత్యేకంగా సమావేశమైంది.
  • 2017: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అర్ధరాత్రి సమావేశం జరిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు