Election Commission: ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ

సార్వత్రిక ఎన్నికల క్రమంలో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published : 18 May 2024 19:07 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రలోభాల పర్వం సాగుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల క్రమంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45 శాతం వాటా అని, రూ.3,958 కోట్ల మేర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు రూపేణా రూ.849.15 కోట్లు, మద్యం (రూ.814.85 కోట్లు), మాదక ద్రవ్యాలు (రూ.3,958 కోట్లు), బంగారం, వెండి వంటి ఆభరణాలు (రూ.1,260.33 కోట్లు), ఇతర ఉచితాలు (రూ.2006.59 కోట్లు) ఉన్నట్లు ఈసీ తెలిపింది. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల స్వాధీనంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొంది. గుజరాత్ ఏటీఎస్‌, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లు కలిసి చేపట్టిన ఆపరేషన్లలో కేవలం మూడు రోజుల్లోనే రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు వెల్లడించింది.

కోడ్‌పై ఈసీకి ‘విజిల్‌’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు

అత్యధికంగా గుజరాత్‌లో రూ.1,461.73 కోట్ల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ నివేదికలో వెల్లడైంది. రాజస్థాన్‌ (రూ.1133.82 కోట్లు), పంజాబ్‌ (రూ.734.54 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.301.75 కోట్లు, తెలంగాణలో రూ.333.55 కోట్ల సొత్తు జప్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని