Nitin Gadkari: విరాళాలు లేకుండా పార్టీని నడపలేం: ఎన్నికల బాండ్లపై గడ్కరీ వ్యాఖ్యలు

Nitin Gadkari: ఎన్నికల బాండ్ల వెనుక ఉద్దేశం మంచిదేనన్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీలను నడపలేమని తెలిపారు.

Published : 23 Mar 2024 13:14 IST

అహ్మదాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్నికల బాండ్ల (Electoral Bonds) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తాజాగా దీనిపై స్పందించారు. మంచి ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు. విరాళాలు లేకుండా ఏ రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల బాండ్ల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం గురించి జరిగిన చర్చల్లో నేను కూడా పాల్గొన్నా. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు. అందుకే కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం.. పార్టీలు నేరుగా నిధులు పొందేందుకే. అయితే, అధికారంలో ఉన్న పార్టీ మారితే సమస్యలు తలెత్తుతాయన్న కారణంతో దాతల పేర్లను బయటపెట్టలేదు’’ అని గడ్కరీ వెల్లడించారు.

దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భూరి విరాళం

‘‘క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నిధుల్లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోరాడుతాయి? విరాళాల్లో పారదర్శకత ఉండాలన్న మంచి ఉద్దేశంతోనే మేం ఈ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తిస్తే.. సరిదిద్దమని పార్టీలను కోరాల్సింది. అలాంటి ఆదేశాలు వస్తే.. పార్టీలన్నీ కలిసి కూర్చుని దీనిపై చర్చించుకోవాలి’’ అని కేంద్రమంత్రి  పేర్కొన్నారు.

ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల వివరాలన్నింటినీ ఈసీకి ఎస్‌బీఐ సమర్పించగా.. కేంద్ర ఎన్నికల సంఘం వాటిని వెబ్‌సైట్‌లో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని