Tripura CM: త్రిపుర నూతన సీఎంగా మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 15 May 2022 14:05 IST

అగర్తలా: త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య.. మాణిక్‌ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొన్నటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లక్‌ కుమార్‌ దేవ్‌ రాజీనామా చేయడంతో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మాణిక్‌ సాహాకు సీఎం పదవి వరించిన సంగతి తెలిసిందే.

వృత్తిరీత్యా దంత వైద్యుడైన 69 ఏళ్ల సాహా 2016లో కాంగ్రెస్‌ను వదిలి భాజపాలో చేరారు. 2020 నుంచి భాజపా త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బిప్లవ్‌ దేవ్‌ రాజీనామా చేయడంతో సాహాను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన కొన్ని సంవత్సరాల్లోనే పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

ఇదిలాఉంటే, 2018 త్రిపురలో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహించిన బిప్లవ్‌ దేవ్‌.. అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్‌ ఉండేదని ఒకసారి వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో 1997లో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌.. డయానా హేడెన్‌కు దక్కడాన్ని ప్రశ్నించారు. ఐశ్వర్యారాయ్‌ భారత్‌ అందానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు దేవ్‌ పదవికి ముప్పు తెచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాను దిల్లీ వెళ్లి కలిసి వచ్చిన మరుసటి రోజే గవర్నర్‌ ఎస్‌.ఎన్‌.ఆర్యకు దేవ్‌ రాజీనామా సమర్పించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని