Santiago Martin: అత్యధిక ఎలక్టోరల్‌ బాండ్లు కొన్న ఆ లాటరీ కింగ్‌ ఎవరు..!

ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు బహిర్గతం కావడంతో ఓ పేరు చర్చనీయాంశంగా మారింది. ఆయన కంపెనీనే అత్యధికంగా బాండ్లను కొనుగోలు చేసింది. ఇంతకీ ఎవరా వ్యక్తి..?

Updated : 15 Mar 2024 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు బహిర్గతం చేయగానే ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు అందరినీ ఆకర్షించింది. ఆ సంస్థే 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైనవి కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో ఇప్పుడు ఆ సంస్థ యజమాని, లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ (Santiago Martin) పేరు చర్చనీయాంశంగా మారింది. ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి భారత్‌లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చే స్థాయికి చేరుకోవడం గమనార్హం. ఆయన జీవితంలో చాలా వివాదాలూ ఉన్నాయి.

మయన్మార్‌లో కూలీగా..

ఆయన కంపెనీకి చెందిన వెబ్‌సైట్‌లో మార్టిన్‌ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వివరాలున్నాయి. తొలినాళ్లలో మయన్మార్‌లో కూలీగా పనిచేశారు. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. దానిని కర్ణాటక, కేరళకు విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్‌, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌లను మొదలుపెట్టారు. స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్‌టైల్‌, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు.

ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్‌ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. ఇది ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది. 

ఈడీ దాడులు.. సీబీఐ కేసులు..

ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ సంస్థపై వివాదాలు కూడా తక్కువేమీ లేవు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. మార్టిన్‌ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

ఇక 2011లో కోయంబత్తూర్‌లో మార్టిన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణలు, మోసం చేయడం వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని