Vaccine: మోడెర్నా టీకా వచ్చేస్తోంది..

అతి త్వరలో దేశంలోకి మరో విదేశీ కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రముఖ ఫార్మా

Updated : 29 Jun 2021 16:22 IST

టీకా దిగుమతికి సిప్లాకు డీసీజీఐ అనుమతులు

దిల్లీ: అతి త్వరలో దేశంలోకి మరో విదేశీ కరోనా టీకా వచ్చేస్తోంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసినట్టు సమాచారం. మోడెర్నా డోసుల దిగుమతి, మార్కెటింగ్‌ అనుమతుల కోసం సిప్లా సోమవారం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును పరిశీలించిన డీసీజీఐ.. మోడెర్నా టీకాను పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

‘‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ పరిమితులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. టీకా పంపిణీ చేపట్టిన తర్వాత తొలి 100 లబ్ధిదారులకు సంబంధించి 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాల్సి ఉంటుంది’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి. మోడెర్నా వ్యాక్సిన్‌.. భారత్‌లో అందుబాటులోకి వస్తోన్న నాలుగో కరోనా టీకా. స్వదేశీ టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.  

మోడెర్నా టీకాను mRNA టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ప్రయోగాల్లో 90శాతానికి పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఫైజర్‌ టీకా కూడా అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లోనూ ఈ టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డీసీజీఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెడెర్నా టీకాను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు సిప్లా.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని