PM Modi: కశ్మీర్‌ ట్రిప్‌ వీడియో షేర్‌ చేసిన సచిన్‌.. మోదీ రిప్లై

PM Modi - Sachin Tendulkar: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ కశ్మీర్‌ టూర్‌ను ప్రశంసించారు.

Updated : 28 Feb 2024 16:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ఇటీవల కుటుంబంతో కలిసి కశ్మీర్‌ (Kashmir)లో పర్యటించారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్పందించారు. ఈ పర్యటనలో ‘ఉజ్వల భారత్‌’ గురించి చాటిచెప్పడం అద్భుతమంటూ ప్రశంసించారు.

భార్య అంజలి, కుమార్తె సారా తెందూల్కర్‌తో కలిసి సచిన్‌ కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యటక ప్రాంతాలను సందర్శించారు. పుల్వామా జిల్లాలోని బ్యాట్‌ తయారీ యూనిట్‌కు వెళ్లారు. పారా క్రికెటర్‌ ఇంటికి వెళ్లడం, వీధుల్లో స్థానికులతో కలిసి క్రికెట్‌ ఆడటంతో పాటు జవాన్లతోను ముచ్చటించారు. తన ట్రిప్‌ వీడియోను ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. తొలిసారి కశ్మీర్‌ లోయకు మోదీ..!

‘‘కశ్మీర్‌ పర్యటన నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ అందమైన అనుభవంగా మిగిలిపోతుంది. చుట్టూ మంచుతో కప్పి ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రజల ఆత్మీయ ఆతిథ్యం దాన్ని మైమరపించింది. మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీజీ అన్నారు. ఈ ట్రిప్‌ తర్వాత ఆయన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇక, కశ్మీర్‌ విల్లో బ్యాట్లు.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ వరల్డ్‌’కు గొప్ప ఉదాహరణ. ఈ బ్యాట్లను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ఈ పర్యటన తర్వాత నేను చెప్పేది ఒక్కటే.. ‘ఉజ్వల భారత్‌’ ఆణిముత్యాల్లో ఒకటైన జమ్మూకశ్మీర్‌కు విచ్చేసి.. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి’’ అని సచిన్‌ రాసుకొచ్చారు.

ఈ వీడియోకు ప్రధాని మోదీ స్పందిస్తూ మాస్టర్‌ బ్లాస్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘అద్భుతంగా ఉంది. మీ పర్యటన నుంచి యువత రెండు ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి.     1. ఉజ్వల భారత్‌లో పలు విభిన్న పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. 2. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాముఖ్యత. మనమంతా కలిసి వికసిత, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మిద్దాం..!’’ అని ప్రధాని పోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు