DK Shivakumar: సీఎం కావాలనే తొందరేం లేదు : కుమారస్వామికి డీకేఎస్‌ కౌంటర్‌

డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తాము మద్దతు ఇస్తామని హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీకేఎస్‌.. తాను సీఎం కావాలనే తొందరేం లేదని స్పష్టం చేశారు.

Updated : 05 Nov 2023 14:02 IST

హుబ్బళ్లి: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తమ 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై డీకే శివకుమార్‌ స్పందించారు. ముఖ్యమంత్రి (Karnataka CM) కావాలనే తొందర తనకేమీ లేదని స్పష్టం చేశారు.

‘సమష్టి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నాం. మేము సుపరిపాలన అందించాల్సి ఉంది. నాకు (ముఖ్యమంత్రి పదవి చేపట్టడంపై) తొందరేం లేదు. దీనిపై నేను.. ఎవరినీ, అధిష్ఠానాన్ని కూడా డిమాండ్‌ చేయలేదు. అధిష్ఠానం ఏం చెబితే అదే పాటిస్తాం. సిద్ధరామయ్యే మా నేత. ఆయన కూడా ఈ విషయాన్నే చెప్పారు. ఇదే మా నిబద్ధత’ అని డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్‌ ఆదేశాలను సిద్ధరామయ్య కూడా పాటిస్తారని డీకేఎస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండున్నరేళ్లకు ‘సీఎం’ను మారుస్తారా..? సిద్ధరామయ్య ఏమన్నారంటే..!

కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి జరగనుందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొన్ని రోజుల తర్వాత డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో అధిష్ఠానం ఆదేశిస్తే తాను సీఎం పదవి చేట్టేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక ఐటీశాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే పేర్కొన్నారు. ఇలా సీఎం పీఠంపై పలువురు కాంగ్రెస్‌ నాయకులు స్పందిస్తోన్న క్రమంలో జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతమంది ఆకాంక్షిస్తున్నారో తెలియదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తాము మద్దతు ఇస్తామని వ్యాఖ్యానించారు. శివకుమార్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే తెరవెనుక నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అయితే.. వీటిని తోసిపుచ్చుతూ డీకే శివకుమార్‌ ఇలా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని