Cyclone Biparjoy: తుపానుపై అప్రమత్తంగా ఉండండి.. ప్రజలను తరలించండి: ప్రధాని మోదీ

బిపోర్‌జాయ్‌ తుపాన్‌ (Cyclone Biparjoy) సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.

Published : 12 Jun 2023 18:32 IST

దిల్లీ: అరేబియా సముద్రం (Arabian Sea)లో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాన్‌ (Cyclone Biparjoy) అతితీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తుపాను పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష (Review Meet) నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.

విద్యుత్తు, తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టేలా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తుపాను పరిస్థితులను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపింది. ఇప్పటికే 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించిందని, మరో 15 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది.

మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (NCMC) సైతం బిపోర్‌జాయ్‌ తుపాను సంసిద్ధత చర్యలను సమీక్షించింది. తుపాను ప్రస్తుత పరిస్థితిని వాతావరణ శాఖ వివరించింది. ‘ఈ తుపాను జూన్ 14 వరకు ఉత్తర దిశగా కదులుతూ.. ఆ తర్వాత గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లను దాటుతుంది. జూన్ 15 మధ్యాహ్నం నాటికి గుజరాత్‌లోని మాండ్వి, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య జఖావూ పోర్ట్‌ (గుజరాత్‌) సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 125-150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి’ అని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని