Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీబీఐ

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదానికి ( Odisha Train Tragedy) అనుమతులు లేని మరమ్మతులే కారణమని సీబీఐ వెల్లడించింది.

Updated : 25 Aug 2023 18:56 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటనకు (Odisha Train Tragedy) అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే కారణమని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) వెల్లడించింది. సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ ఇన్‌ఛార్జి) అరుణ్‌ కుమార్‌ మహంత.. ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరైన అరుణ్‌ కుమార్‌ మహంత తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ భువనేశ్వర్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. దీనిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది.

బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్‌ లెవెల్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయని కోర్టుకు వివరించింది. దీనికోసం ఆయన సీనియర్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ అండ్‌ టెలికం) నుంచి అనుమతులు గానీ, సర్క్యూట్‌ చిత్రంగానీ తీసుకోలేదని తెలిపింది. గేట్‌ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్‌ చిత్రం ఆధారంగానే ఇక్కడ మరమ్మతులు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించింది. పనులు జరుగుతున్నప్పుడు మహంత అక్కడే ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే మరమ్మతులు చేపట్టారని, అందువల్ల ఆయనకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు.

మోదీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు.. కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

మహంత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ గత కొంత కాలంగా సరిగా పని చేయడం లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. పర్యవేక్షణ పనిని ఇతర వ్యక్తులకు అప్పగించారని, అందువల్ల ప్రమాదానికి మహంత బాధ్యుడు కాదని అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం మహంతకు బెయిల్‌ నిరాకరించింది. సిగ్నల్‌, ఇంటర్‌లాకింగ్‌ ఇన్‌స్టాలేషన్లను పరీక్షించడం, సరిదిద్దడం, మార్పులు చేయడం పిటిషనర్‌ (మహంత) విధుల్లో భాగమని పేర్కొంది. ఉన్నతాధికారులు ఆమోదించిన సూచనలకు అనుగుణంగా అతడు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండేదని అభిప్రాయపడింది. అందులో విఫలమైనందువల్లే.. 296 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం..ఈ ప్రమాదానికి మహంతానే ప్రధాన కారకుడని కోర్టు భావిస్తోందని పేర్కొంది.

జూన్‌ 2న ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మెయిన్‌లైన్‌లోకి వెళ్లడానికి సిబ్బంది గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆ రైలు లూప్‌లైన్లోకి వెళ్లి అప్పటికే అక్కడ ఆగి ఉన్న గూడ్సురైలును ఢీకొట్టింది. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో దూసుకువస్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. కేంద్రం సిఫారసు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు