baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?

‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు.

Updated : 18 Feb 2024 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా ‘బాహుబలి’(baahubali). ప్రభాస్‌(Prabhas), రానా(Rana), అనుష్క( Anushka Shetty), తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాకే హైలైట్‌గా నిలిచిన కట్టప్ప పాత్రకు మొదట బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ను అనుకున్నామని సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ తెలిపారు. 

‘‘బాహుబలి పాత్ర ప్రభాస్‌ కోసం రాసిందే. కానీ, కట్టప్పగా సంజయ్‌దత్‌ను అనుకున్నాం. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్‌ను సంప్రదించాం. ప్రభాస్‌తో సినిమా చేయాలని మంచి కథకావాలని రాజమౌళి కోరాడు.  స్త్రీ, పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్‌ డ్రామాగా ఉండాలన్నారు. నా దగ్గర అలాంటి కథలేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. అదేంటంటే భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గ వీరుడిగా పేరొందిన వృద్ధుడు యువకులకు కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడి గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు. చేతిలో కత్తి ఉన్నంతకాలం అతన్ని ఓడించలేరని చెప్తాడు. అది విన్న విదేశీయుడు ఆ మహావీరుడిని కలవాలని వృద్ధుణ్ని అడుగుతాడు. అయితే అతను లేడని తెలియడంతో ‘ఆ వీరుడు ఎలా చనిపోయాడు’ అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తిమంతమైన ఆయుధం ఇంకొకటి లేదని, బాహుబలిని చంపింది తానేనని వృద్ధుడు వెల్లడిస్తాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుందని చెప్పాను. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నింటీని కలిపి కథ రాయమని మౌళి చెప్పాడు. ఆ స్క్రిప్ట్‌ పూర్తి చేయడానికి నాలుగైదు నెలలు పట్టింది’’అని విజయేంద్ర ప్రసాద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని