తారస్థాయిలో దుబ్బాక ఉపఎన్నికల పోరు

దుబ్బాక ఉప ఎన్నిక పోరు తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుపెంచాయి. త్రిముఖ పోరులో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి...

Published : 31 Oct 2020 01:15 IST

వ్యూహాలు రచిస్తున్న పార్టీలు

విస్తృత ప్రచారం చేస్తున్న నేతలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబ్బాక ఉప ఎన్నిక పోరు తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుపెంచాయి. త్రిముఖ పోరులో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలోనే మకాం వేసి తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. నవంబర్‌ 1న సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనుండటంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయకులు ముందుకుసాగుతున్నారు. తెరాస తన ప్రచారంలో ప్రధానంగా భాజపాపై దృష్టిసారిస్తోంది. కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ నేతలు ర్యాలీలు, సభల్లో ప్రస్తావిస్తున్నారు. సిద్దిపేటలో అంజన్‌రావు ఇంట్లో నగదు స్వాధీనం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తెరాస, భాజపా నాయకులు రాజకీయ ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్‌.. తెరాస, భాజపా ఒక్కటేనని ఆరోపిస్తోంది.

కేంద్రం నిధులపై చర్చలకు రావాలని తాను సవాలు విసిరితే భాజపా నేతలు ముఖం చాటేశారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ప్రచారం నిర్వహించిన ఆయన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

భాజపాతో తెరాస లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ఔన్నత్యాన్ని తాకట్టు పెడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మిరుదొడ్డి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. భాజపా తెచ్చే బిల్లులకు తెరాస మద్ధతు పలుకుతోందన్న రేవంత్‌రెడ్డి దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని పేర్కొన్నారు.

కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు వస్తున్నా తెరాస అసత్యాలు ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్ధతుగా ఆయన మిరుదొడ్డి మండలం మోతెలో ప్రచారం చేశారు. రోజురోజుకూ దుబ్బాకలో భాజపాకు ఆదరణ పెరుగుతోందన్న సంజయ్‌ సర్వేలు సైతం కమలానికే పట్టం కడుతున్నాయని తెలిపారు.

దుబ్బాకలో ఉపఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ సునీల్‌ అరోరాకు లేఖ రాశారు. తెరాస, భాజపాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయన్న ఆయన ఎన్నికలకు రాష్ట్ర పోలీసులను, జిల్లా అధికారులను ఉపయోగించవద్దని కోరారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని