KTR: ఎప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేటీఆర్‌

కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని.. చీకటి పాలనకు కర్ణాటక చిరునామా అని విమర్శించారు.

Updated : 19 Oct 2023 10:42 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని.. చీకటి పాలనకు కర్ణాటక చిరునామా అని విమర్శించారు. గత పదేళ్లలో గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. నిన్నైనా.. నేడైనా.. రేపైనా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ను నమ్మేదెవరు?

‘‘కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే కాంగ్రెస్‌ను నమ్మేదెవరు? కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు.. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా? దశాబ్దాలుగా పోడు భూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. 

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ అప్పుడే మొదలైంది

తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే వందల మంది బలిదానాలకు కారణం. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్‌. టికెట్ల కోసం రూ.కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న వ్యక్తి రేవంత్‌. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ 10-జన్‌పథ్. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. 3 రోజుల పర్యటన చేసినా..  300 రోజులు ముక్కు నేలకు రాసినా... తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు... ఎప్పటికీ విశ్వసించరు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని