PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు.
మహబూబ్నగర్: చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని భాజపా పూరించింది. ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. మహబూబ్నగర్లో తొలుత అధికారిక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓపెన్టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదికైన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి మహిళలు నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ప్రజలకు ఇవాళ శుభదినం
అనంతరం పాలమూరు ప్రజలకు నమస్కారాలు అంటూ ప్రధాని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని భాజపా శ్రేణులకు భరోసా కల్పించారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఇవాళ శుభదినం. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాం. కేంద్రం చేపట్టే ప్రాజెక్టులతో ప్రజలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భాజపాకు అండగా నిలుస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాను బలపర్చారు. ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటున్నదని స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని మోదీ అన్నారు.
మజ్లీస్ చేతిలో భారాస సర్కార్
భారాస సర్కారు మజ్లీస్ చేతిలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్ ఎవరిచేతుల్లో ఉందో ప్రజలకు తెలుసన్నారు. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ఆ కంపెనీలో డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని ఎద్దేవా చేశారు. కొన్ని అవసరాల కోసం కొందరిని సహాయకులుగా నియమించుకున్నారని విమర్శించారు. భాజపాపై ప్రజల ప్రేమ చూసి కాంగ్రెస్, భారాసకు నిద్రపట్టదన్నారు.
ధీరవనితలు పుట్టిన గడ్డ
‘‘రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ మనది. మహిళల గొంతు చట్టసభల్లో మరింత గట్టిగా వినిపించే రోజులు వస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల చట్టంతో చట్టసభల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుంది. మహిళలు ఇల్లు కట్టుకుంటే కేంద్రం పీఏంఏవై నిధులు ఇస్తోంది. భాజపా ప్రభుత్వం 9 ఏళ్లలోనే తెలంగాణలో 2500 కి.మీ హైవేలు నిర్మించింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ముద్ర బ్యాంకు ద్వారా వీధివ్యాపారులకు రుణాలు ఇస్తున్నాం. 2014కు పూర్వం ధాన్యం కొనుగోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. భాజపా ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లకు రూ.27 వేల కోట్లు ఇస్తోంది. తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి లబ్ధిపొందిన సర్కారు ఆ తర్వాత రైతులను విస్మరించింది. పీఎం కిసాన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించి ఎరువుల కొరత తీర్చాం’’ అని మోదీ వివరించారు.
సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం: కిషన్రెడ్డి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజన్నారు. కోట్లాది మంది పూజించే వనదేవతలు సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుండటం సంతోషకరమన్నారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పసుపు రైతులు పసుపుబోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, దశాబ్దాల నాటి కలను మోదీ సాకారం చేశారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.