Telangana News: నేను కాంగ్రెస్లో చేరినా తెరాసకు ఐప్యాక్ సేవలు
తాను కాంగ్రెస్లో చేరినా తన ఐప్యాక్ సంస్థ తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ను కలుపుకొనివెళ్లే...
జాతీయస్థాయి ప్రత్యామ్నాయ వేదికలో కాంగ్రెస్కు చోటివ్వాలి
అన్ని శక్తులూ ఏకమైతేనే భాజపాను గద్దె దించగలం
కొందరు ఎమ్మెల్యేలను మార్చాలి
సీఎం కేసీఆర్తో ప్రశాంత్కిశోర్
భాజపా, కాంగ్రెస్లకు దూరంగా ఉంటామని కేసీఆర్ స్పష్టీకరణ
ఈనాడు - హైదరాబాద్
తాను కాంగ్రెస్లో చేరినా తన ఐప్యాక్ సంస్థ తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిశోర్ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు. భాజపా వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని వెల్లడించారు. అయితే, తాము భాజపా, కాంగ్రెస్లతో సమదూరం పాటిస్తామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నట్లు సమాచారం. ఆదివారం రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్తో పీకే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆ పార్టీని ఎంచుకున్నానని పీకే పేర్కొన్నట్లు తెలిసింది. తాను కాంగ్రెస్లో చేరినా... తమ సంస్థ ఐప్యాక్ తెరాసకు రాజకీయ సలహా సేవలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెరాస, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎంకు పీకే వివరించినట్లు తెలుస్తోంది.
ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి
భాజపాపై దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని ఇతర పక్షాలన్నీ సొమ్ము చేసుకోవాలని పీకే సూచించినట్లు తెలిసింది. గతంతో పోలిస్తే భాజపాకు లోక్సభ సీట్ల శాతం తగ్గుతుందని, విపక్షాల సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాతైనా భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాము భాజపా, కాంగ్రెస్లకు దూరంగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని సమాచారం. భాజపా, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమే బలంగా రూపుదిద్దుకుంటుందని అన్నట్లు తెలుస్తోంది. అది సాధ్యం కాకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ పెట్టే అంశంపైనా చర్చించారు. పీకే కాంగ్రెస్లో చేరిన తర్వాత ఐప్యాక్ను స్వతంత్రంగా పనిచేయించాలని, లేకుంటే ఆ సంస్థ సేవలు పొందే పార్టీలన్నీ కాంగ్రెస్తో కలుస్తాయనే అపప్రథ వస్తుందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
కేంద్రం వైఫల్యాలే.. తెరాసకు ఆయుధాలు
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంపై భాజపా అంతులేని వివక్ష చూపుతోందని, విభజన హామీలను నెరవేర్చడంలో వైఫల్యంతో పాటు ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం చూపడం వంటివి తెరాసకు వచ్చే ఎన్నికల్లో పదునైన ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడతాయని పీకే వివరించినట్లు తెలిసింది. కేంద్రం పక్షపాత ధోరణిపై రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి దీన్ని ఇంటింటికీ తీసుకెళ్లగలిగితే భాజపాను ప్రజలు తిరస్కరించి, తెరాసకు పట్టం కడతారని వెల్లడించినట్లు తెలిసింది. దీనిపై కార్యాచరణను సైతం పీకే నిర్దేశించారు.
కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
రాష్ట్రంలో తాము చేసిన సర్వే సారాంశాన్ని కేసీఆర్కు ప్రశాంత్ కిశోర్ వివరించారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని, ఈ విషయం తెరాస అధిష్ఠానం దృష్టిలో ఉందని తెలిసినా వారు మారడం లేదని, మరోసారి సిట్టింగులందరికీ సీట్లు వస్తాయనే ధైర్యంతో ఉన్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయం పరిశీలించాలని పీకే సూచించినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారినే వేధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సొంత పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయిస్తూ, మరో పార్టీలోకి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారనే అంశాన్ని ఉదహరించినట్లు సమాచారం. శ్రేణులకు నిరంతర కార్యక్రమాలను నిర్దేశిస్తేనే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు.
త్రిముఖ పోరుతో తెరాసకు లాభం
వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోరు జరుగుతుందని, ఇది తెరాసకు లాభిస్తుందని పీకే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్ల పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని తెలిపారు. ప్రశాంత్ కిశోర్కు చెందిన ఐప్యాక్ సేవలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సర్వేలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం, పాత, కొత్త ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహం తదితర విషయాల్లో ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటామని చెప్పినట్లు తెలిసింది. తెరాస ప్లీనరీ అనంతరం వీరిద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్