ఎల్‌ అండ్‌ టీకే విమానాశ్రయ మెట్రో!

విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్‌ ఎల్‌ అండ్‌ టీ సంస్థకే ఖరారైనట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశకు గ్లోబల్‌ టెండర్లు పిలవగా.. రెండు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి.

Updated : 10 Aug 2023 06:52 IST

కలసివచ్చిన మొదటి దశ నిర్మాణ అనుభవం
గ్లోబల్‌ టెండర్లలో రెండే బిడ్లు దాఖలు
వచ్చే నెలలో పనులు ప్రారంభించేలా అధికార యంత్రాంగం కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్‌ ఎల్‌ అండ్‌ టీ సంస్థకే ఖరారైనట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండో దశకు గ్లోబల్‌ టెండర్లు పిలవగా.. రెండు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌, ఎన్‌సీసీ లిమిటెడ్‌ మాత్రమే పోటీపడ్డాయి. గత నెల రోజులుగా మెట్రో అధికారులు, జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ కలిసి.. ప్రాజెక్టు అమలులో ఆ రెండు కంపెనీల అనుభవం, సాంకేతిక, ఆర్థిక నివేదికలు, పత్రాలను అధ్యయనం చేశారు. మెట్రో నిబంధనల్లో తొలిసారిగా పొందుపర్చిన ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ)లో అనుభవం, అర్హత ఉన్న ఎల్‌ అండ్‌ టీకే టెండర్‌ ఖరారైనట్లు ఒక అధికారి తెలిపారు. టెండర్‌ అధ్యయన సమాచారం, మెట్రో అధికారుల సిఫార్సులను నివేదించిన అనంతరం.. ప్రభుత్వ అనుమతితో త్వరలో ఈ విషయం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

రూ.5,688 కోట్లకు టెండర్‌

మెట్రో రెండో దశలో మొదటి ప్రాధాన్యంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది ఆఖరులో శంకుస్థాపన చేసింది. ప్రాజెక్టు వ్యయం రూ.6,250 కోట్లుగా అంచనా వేసింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాలని నిర్ణయించింది. ఈపీసీ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎంఎల్‌) ఇటీవల గ్లోబల్‌ టెండర్లను పిలిచింది. జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ వ్యయం, ఆకస్మిక వ్యయం, మల్టీ మోడల్‌ ఇంటిగ్రేషన్‌ వంటివి మినహాయించి రూ.5,688 కోట్లకు టెండర్‌ పిలిచింది. హైదరాబాద్‌లో మొదటి దశను చేపట్టిన, దేశంలోని వేర్వేరు నగరాల్లో మెట్రోరైల్‌ ప్రాజెక్టులను నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ, బెంగళూరులో విమానాశ్రయ మెట్రో పనులు చేస్తున్న ఎన్‌సీసీ పోటీపడ్డాయి.

ఒకే సంస్థ అన్నీ చేసేలా ఈపీసీ..

శంషాబాద్‌ విమానాశ్రయ మెట్రోని ప్యాకేజీల వారీగా కాకుండా టెండర్‌ దక్కించుకున్న సంస్థే అన్నీ చూసుకునేలా ఈపీసీ పద్ధతిలో గ్లోబల్‌ టెండర్లు పిలిచారు. మెట్రో ప్రాజెక్టుల్లో ఈపీసీ టెండర్‌ పిలవడం ఇదే మొదటిదని అధికారులు తెలిపారు. ఇందులో సివిల్‌ వర్క్స్‌తో పాటు సిగ్నలింగ్‌, ఎలక్ట్రికల్‌, రోలింగ్‌ స్టాక్‌, స్టేషన్‌ ప్లానింగ్‌, ట్రాక్‌ పనులు, డిపోలు, ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ), విద్యుత్‌ స్కాడా వ్యవస్థ ఏర్పాటును టెండర్‌ దక్కించుకున్న సంస్థే చేపట్టాల్సి ఉంది. మొదటి దశలో ఇవన్నీ ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో చేపట్టింది. కాకపోతే అది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టిన ప్రాజెక్టు. విమానాశ్రయ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టు. పీపీపీలో చేసిన అనుభవం ఇక్కడ ఎల్‌ అండ్‌ టీ సంస్థకు సానుకూలంగా మారింది. ఈ నెలలో టెండరు ఖరారు చేసి.. ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థతో వచ్చే నెలలో మెట్రో పనులను ప్రారంభింపజేయాలని అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.


మార్గం: రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం

దూరం: 31 కి.మీ., స్టేషన్లు: 9

ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం: రూ.6,250 కోట్లు

టెండర్‌ వ్యయం: రూ.5,688 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని