ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్‌ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది.

Published : 08 Mar 2024 05:39 IST

కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూపకల్పన
11వ తేదీన పథకం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్‌ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది. స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని కేటాయించనుంది. తొలిదశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ‘అభయ హస్తం’ పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈనెల 11వ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి రావడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్ర రిజర్వు కోటా కింద 33,500 ఇళ్లు

ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయిస్తుంది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నాలుగు దశల్లో ఆర్థిక సహాయం

  • బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష
  • పైకప్పు(రూఫ్‌) స్థాయిలో రూ.లక్ష
  • పైకప్పు నిర్మాణం తరవాత రూ.2 లక్షలు
  • నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష

అర్హులెవరంటే..

  • లబ్ధిదారుడు విధిగా దారిద్య్రరేఖ(బీపీఎల్‌)కు దిగువన ఉన్న వారై ఉండాలి. ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు.
  • లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
  • గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి.
  • గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులే.
  • అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.
  • వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు.
  • ఒంటరి(సింగిల్‌ ఉమెన్‌), వితంతు(విడోవర్‌) మహిళలూ లబ్ధిదారులే.

ఇల్లు మంజూరు ఇలా

  • ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు.
  • ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్‌ ఇంటిని మంజూరు చేస్తారు.
  • గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్‌ ఎంపిక చేస్తారు.
  • లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు.
  • జిల్లాల్లో కలెక్టర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కమిషనర్‌ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి.
  • లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుసభలో ప్రదర్శిస్తారు.
  • 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్‌, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్‌సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు