పెద్దపులులకు నీటి కష్టాలు!

మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి.

Published : 29 Apr 2024 03:12 IST

అడవుల్లో అడుగంటుతున్న జలవనరులు
వాగుల్లో చెలమలు తోడుతున్న అటవీ సిబ్బంది
ట్యాంకర్లు, సోలార్‌ బోర్ల వినియోగం..

ఈనాడు, హైదరాబాద్‌: మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. ఈ పరిస్థితిలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు అటవీ శాఖ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. అడవుల్లో ఏర్పాటుచేసిన సాసర్‌పిట్లలో ట్యాంకర్లతో, సోలార్‌ బోర్లతో కుంటల్లో నీళ్లు నింపడం వంటి చర్యలు చేపట్టింది. ఎండిన వాగుల్లోని ఇసుకను అటవీ సిబ్బంది తవ్వి నీటి చెలమలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృగవని జాతీయ ఉద్యానవనం (చిలుకూరు అభయారణ్యం)లో పనిచేయని సోలార్‌ బోరుకు మరమ్మతులు చేయిస్తున్నారు.

మారుతున్న ఆవాసాలు?

రాష్ట్రంలో రెండు టైగర్‌ రిజర్వులు, 12 వైల్డ్‌లైఫ్‌ శాంక్చరీలు, 3 జాతీయ ఉద్యానవనాలున్నాయి. వన్యప్రాణుల సంచారం ప్రధానంగా వీటిలోనే ఉంది. నీటి వనరులు అడుగంటడంతో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు, కాగజ్‌నగర్‌ కారిడార్‌లో కెమెరా ట్రాపింగ్‌లో పులులు అంతగా కనిపించడంలేదని తెలుస్తోంది. అమ్రాబాద్‌ అడవుల్లో కొన్ని పులులు.. కృష్ణా నదిని దాటి ఏపీ వైపు వెళ్లాయా? అని అధికారులు ఆరా తీస్తున్నారు.

అడవుల్లో భూమిలోకి ఇంకే నీళ్లు తక్కువే?

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా, అందులో అటవీ ప్రాంతం 66.64 లక్షల ఎకరాలు. ఇందులో చిక్కటి అడవి 33.94 శాతమే ఉంది. కార్చిచ్చులతో మట్టి నాణ్యత తగ్గుతోంది. దీంతో అడవుల్లో వర్షపు నీరు ఇంకే సామర్థ్యం తగ్గి..భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఫలితంగా ఉపరితల జలవనరులు త్వరగా ఎండిపోతున్నాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.


నీటి కొరత అధిగమించేందుకు అన్ని చర్యలు

- ఎం.సి.ఫర్గెయిన్‌, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌ లైఫ్‌)

అడవుల్లో నీటి కొరతను అధిగమించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎండిన వాగుల్లో నీటి చెలమలు తవ్వడం ఫలితాలనిస్తోంది. దగ్గరలోని గ్రామ పంచాయతీల ట్యాంకర్లనూ తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నాం. సాసర్‌పిట్లను మూడునాలుగు రోజులకోసారి నింపుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని