Israel-Hamas Conflict: రంగంలోకి బైడెన్‌.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్‌ అనుమతి

Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Published : 29 Apr 2024 08:04 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో అతలాకుతలమైన గాజాలోకి మరింత సహాయ సామగ్రిని చేర్చే దిశగా అమెరికా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈవారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హమాస్‌ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ (Israel) చేపట్టిన యుద్ధంతో గాజాలో తీవ్ర క్షామం నెలకొంది. సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. దీంతో ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించింది. రఫాలోనూ భూతల దాడులు ప్రారంభిస్తే గాజాలోని మిగిలిన ప్రాంతంతో దానికి సంబంధాలు తెగిపోనున్నాయి. అప్పుడు ఈ దారులే కీలకం కానున్నాయి.

రఫాలోని దాదాపు పది లక్షల మంది పాలస్తీనావాసులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్‌కూ అమెరికా మద్దతు ఉండబోదని బైడెన్‌ (Joe Biden) ఈ సందర్భంగా తేల్చి చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. రఫా ఆక్రమణను అగ్రరాజ్యం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు గతంతో పోలిస్తే గాజాలోకి మానవతా సాయం ముమ్మరంగా చేరుతోందని బైడెన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగేందుకు సహకరించాలని నెతన్యాహుకు సూచించారు.

హమాస్‌ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్‌ (Joe Biden) ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ భద్రత విషయంలో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని