Canada: భారత్‌-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?

ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికా స్వరం మెల్లగా మారుతోంది. ఇటువంటి ఆరోపణల విషయంలో భారత్‌కు ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. కెనడాతో అభిప్రాయభేదాలు లేవని వివరణ ఇచ్చింది.  

Updated : 22 Sep 2023 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఖలిస్థాన్‌ టైగర్ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Nijjars) హత్య విషయంలో అమెరికా (USA) స్వరం మెల్లిగా మారుతోంది. తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలీవాన్‌ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ భారత్‌కు ప్రత్యేక మినహాయింపులు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. ‘‘దౌత్యవేత్తలతో ప్రైవేటుగా ఏం సంభాషణ జరిగిందో వెల్లడించను. కానీ, ఈ విషయంలో మేము భారత్‌లోని అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలతో టచ్‌లో ఉన్నాం.. ఇక ముందు కూడా ఉంటాం. ఇది అమెరికాకు ఆందోళనకరం.. మేము తీవ్రంగా పరిగణించే విషయం. నిరంతరం దీనిపై సంప్రదింపులు చేస్తాం. ఈ విషయంలో భారత్‌కు ప్రత్యేకమైన మినహాయింపు లేదు’’ అని పేర్కొన్నారు. 

కెనడాతో అభిప్రాయభేదాలు లేవు: అమెరికా

భారత్‌ (India)తో సంబంధాలు బలోపేతం చేసుకొనే క్రమంలో కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదనే వాదనను అమెరికా ఎన్‌ఎస్‌ఏ సలీవాన్‌ తోసిపుచ్చారు. కెనడా (Canada) ఆరోపణలను బైడెన్‌ కార్యవర్గం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. ‘‘మేము కెనడాతో నిరంతరం టచ్‌లో ఉన్నాం. ఇటువంటి పనులకు ఎటువంటి ప్రత్యేక మినహాయింపు ఉండదు. ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. ప్రాథమిక సూత్రాలకు మేం కట్టుబడి ఉంటాం. అక్కడి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, దౌత్య కార్యక్రమాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కెనడాతో ఎటువంటి అభిప్రాయభేదాలు లేవు’’ అని సలీవాన్‌ వెల్లడించారు. 

జీ20లోనే బైడెన్‌ ప్రస్తావించారు: ఫైనాన్షియల్‌ టైమ్స్‌

జీ20లోనే.. నిజ్జర్‌ హత్యపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రస్తావించారని బ్రిటన్‌ పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం వెలువరించింది. ముఖ్యంగా ఆంగ్లో సాక్సన్‌ దేశాల సమూహమైన ‘ఫైవ్‌ ఐస్‌’ గ్రూప్‌లోని పలు సభ్యదేశాలు కూడా అదే సమయంలో తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అప్పట్లో నిజ్జర్‌ విషయాన్ని ప్రధాని మోదీ వద్ద నేరుగా ప్రస్తావించాలని ఫైవ్‌ఐస్‌ సభ్యదేశాలను కెనడా కోరింది. దీంతో బైడెన్‌, ఇతర దేశాధినేతలు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు ఆ పత్రిక పేర్కొంది. దీనిపై శ్వేతసౌధం మౌనం వహిస్తోంది.

కెనడాపై కఠిన వైఖరి

వాస్తవానికి జీ20 సదస్సు సందర్భంగా కెనడా-భారత్‌ ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. ఇవి ముగిసిన వెంటనే కెనడాలోని ఖలిస్థాన్‌ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్‌ ప్రకటన వెలువరించింది.

హ్యూమన్‌, సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారాలను సేకరించిందా..

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడా ప్రభుత్వం మానవ, సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని సేకరించిందని అక్కడి పత్రిక సీబీఎస్‌ న్యూస్‌ కథనం ప్రచురించింది. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమచారం ఆధారంగానే ఈ కథనం వెలువరించినట్లు చెబుతోంది. తమ ప్రభుత్వం వద్ద ఉన్న ఇంటెలిజెన్స్‌లో కెనడాలోని భారత దౌత్య అధికారులు స్వయంగా పాల్గొన్న సంభాషణలున్నాయని పేర్కొంది. ఈ ఇంటెలిజెన్స్‌ సమాచారం ఫైవ్‌ఐస్‌ బృందంలోని ఓ సభ్య దేశం నుంచి కెనడాకు వచ్చినట్లు తెలిపింది.  ఆ తర్వాత కెనడా అధికారులు పలు మార్లు భారత్‌కు వచ్చి నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తునకు సహకరించాలని కోరినట్లు వెల్లడించింది. మరోవైపు ప్రైవేటు సంభాషణల్లో భారతీయ అధికారులు ఎవరూ ఈ ఆరోపణలను బలంగా ఖండించకపోవడం కూడా న్యూదిల్లీ హస్తాన్ని సూచిస్తోందని సీబీఎస్‌ కథనంలో పేర్కొంది. ముఖ్యంగా భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఈ ఇంటెలిజెన్స్‌ను సేకరించినట్లు కెనడా అధికారి వెల్లడించారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ కథనంలో వెల్లడించింది. 

బలమైన కారణాలున్నాయి: ట్రూడో

మరోవైపు నిజ్జర్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందనడానికి బలమైన కారణాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గురువారం అన్నారు. ఆయన ఐరాసలోని కెనడా దౌత్య బృందంతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా వ్యక్తిని.. కెనడా భూమిపై చంపడంలో భారత్‌ పాత్ర ఉందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని