ప్రయాణికులతో సంప్రదిస్తున్నాం

మానవ అక్రమ రవాణా అనుమానంతో భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని పారిస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.

Published : 24 Dec 2023 04:33 IST

ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేతపై స్పందించిన భారత ఎంబసీ
కొనసాగుతున్న విచారణ

పారిస్‌: మానవ అక్రమ రవాణా అనుమానంతో భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని పారిస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పారిస్‌ అధికారులు అందించిన సమాచారం మేరకు ప్రయాణికులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ‘‘విమాన ప్రయాణికులు, సిబ్బంది గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నాం. వారి ప్రయాణానికి గల కారణాలు ఆరా తీస్తున్నాం’’ అని పారిస్‌ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఫ్రాన్స్‌లోని జాతీయ వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. రొమేనియా సంస్థ లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం గురువారం దుబాయి నుంచి నికరాగువాకు వెళుతూ ఇంధనం నింపుకోవడం కోసం పారిస్‌కు 150 కి.మీ.ల దూరంలోని వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని అందిన  సమాచారం మేరకు ఫ్రాన్స్‌ అధికారులు ఆ విమానాన్ని తమ అధీనంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే. విమానంలోని 303 మంది ప్రయాణికుల్లో అత్యధికంగా  భారతీయులే ఉన్నారు. వారిలో 13 మంది మైనర్లు అని స్థానిక పత్రిక వెల్లడించింది. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించేందుకుగాను సెంట్రల్‌ అమెరికాకు చేరుకునే ప్రణాళికలో భాగంగా వీరంతా నికరాగువాకు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఫ్రెంచ్‌ అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని