ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి

అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (77)కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Published : 28 Jan 2024 06:02 IST

పరువునష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు భారీ జరిమానా

‘‘కిందికి పడదోసినపుడు మళ్లీ లేచి నిలబడిన ప్రతి మహిళ సాధించిన గొప్ప విజయమిది. ఆడవాళ్లను అణగదొక్కాలని చూసే ప్రతి తుంటరికి ఇది భారీ ఓటమి’’

మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు తీర్పు అనంతరం జీన్‌ కరోల్‌ ప్రకటన

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (77)కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ (80) దాఖలు చేసిన పరువునష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్‌ ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని ఆదేశించింది. కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్‌ ఇటీవల దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా ట్రంప్‌నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతోపాటు భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుపై శుక్రవారం ఫెడరల్‌ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ట్రంప్‌ అనూహ్యంగా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఈ కేసులో ట్రంప్‌నకు ఇప్పటికే మరో కోర్టు జరిమానా విధించింది. జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు (రూ.41.5 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కరోల్‌ తన రచనలను అమ్ముకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ విమర్శించడంతో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసునే తాజాగా మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు విచారించి.. బాధితురాలికి అదనంగా మరో 83.3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును హాస్యాస్పదంగా పేర్కొన్న ట్రంప్‌.. బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మన న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయింది. ఈ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు’’ అని మండిపడ్డారు. తాజా తీర్పుపైన పైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు.


ఇదీ అసలు వివాదం..

1996లో మాన్‌హటన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోరులో కరోల్‌కు ట్రంప్‌ పరిచయమయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్‌ తనతో మాట కలిపారని, డ్రెస్సింగ్‌ రూంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ అనూహ్య ఘటనతో షాక్‌కు గురై.. అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఓ పుస్తకంలో కరోల్‌ వెల్లడించిన వివరాలను న్యూయార్క్‌ మ్యాగజీన్‌ 2019లో ప్రచురించింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వ్యవహారం న్యాయస్థానం దాకా వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని