మారణహోమానికి ఆరు నెలలు

ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు.. ప్రతిగా హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో టెల్‌అవీవ్‌ సేనల భీకర దాడులు.. ఇలా ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది.

Published : 07 Apr 2024 05:04 IST

భీకర పోరులో 33 వేలు దాటిన మరణాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు.. ప్రతిగా హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో టెల్‌అవీవ్‌ సేనల భీకర దాడులు.. ఇలా ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. దాదాపు 500 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్న హమాస్‌ సొరంగాల్లో చాలావరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. మరోవైపు ఇప్పటికీ 100కు పైగా బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉండటం, గాజాలో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, పాలస్తీనీయుల వెతలు.. యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

పోరు మొదలైందిలా..!

‘ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌’ పేరిట గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపుదాడికి పాల్పడిన హమాస్‌ మిలిటెంట్లు.. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్‌.. ప్రతి దాడులను మొదలుపెట్టింది. ఉగ్రవాదుల అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఆ దేశ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ చెబుతోంది. తమవారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

నిరాశ్రయులైన 17 లక్షల మంది

గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో 70 శాతం మంది మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. ఐరాస వివరాల ప్రకారం.. దాదాపు 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. అటు.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాతోపాటు సిరియాలోని ఇరాన్‌ మద్దతుదారులపైనా నెతన్యాహు సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. యుద్ధం మొదట్లో గాజా సరిహద్దులను దిగ్బంధించడంతో.. ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామగ్రి కొరతతో పౌరులు అల్లాడారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతిఒక్కరూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ రఫాకు దాడులను విస్తరిస్తే.. మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని ఇటీవల హెచ్చరించింది.

కుదరని కాల్పుల విరమణ

దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ.. మరోసారి ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా, కొలంబియాలు యుద్ధ పరిణామాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.

హమాస్‌ చెరలోని మరో బందీ మృతి

హమాస్‌ చెరలో బందీగా ఉన్న ఓ రైతు మృతి చెందినట్లు శనివారం ఇజ్రాయెల్‌ పేర్కొంది. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఆదివారం జరగనున్న మరో రౌండ్‌ చర్చలకు హమాస్‌ బృందం కైరో వెళుతున్న సమయంలో ఇది వెలుగులోకి వచ్చింది. గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు.. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మందిని హత్య చేసి 250 మందిని బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 109 మంది విడుదలయ్యారు. మిగిలిన వారిని విడిపించేంద]ుకు చర్చలు జరుగుతున్నాయి. మృతి చెందిన బందీని కిబుట్స్‌ నిర్‌ ఓజ్‌కు చెందిన ఎలాద్‌ కట్జిర్‌గా గుర్తించారు. హమాస్‌ చెరలోనే 36 మంది వరకు బందీలు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని