Mouse fever: రష్యా దళాలకు ‘మౌస్‌ ఫీవర్‌’ ఎఫెక్ట్‌.. ఉక్రెయిన్ వెల్లడి

రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య 22 నెలలుగా యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో రష్యా దళాలను మౌస్‌ ఫీవర్‌ వేధిస్తోందని కథనాలు వెలువడ్డాయి.

Updated : 22 Dec 2023 18:21 IST

మాస్కో: గతేడాది ప్రారంభం నుంచి రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతోంది. దాంతో రెండువైపులా ప్రాణ నష్టం సంభవిస్తూనే ఉంది. ఈ తరుణంలో రష్యా సైనికులు మౌస్‌ ఫీవర్‌(Mouse fever)తో బాధపడుతున్నారట. ఆ వ్యాధి ఫ్రంట్‌లైన్‌ బలగాలను దెబ్బతీస్తోందని ఉక్రెయిన్‌ నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది.

ఈ చలికాలంలో సరైన సదుపాయాలు కొరవడటంతో కప్యాన్స్క్‌లోని రష్యన్‌ దళాల్లో ఈ మౌస్‌ ఫీవర్ ప్రబలిందని ఉక్రెయిన్‌ నిఘా విభాగం పేర్కొంది. ఇది ఒక బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌. ఎలుకలను తాకినప్పుడు, వాటి వ్యర్థాల మీదుగా వచ్చే గాలిని పీల్చినప్పుడు ఇది సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి బారినపడినవారిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం, బీపీ తగ్గడం, కళ్లు ఎర్రగా మారిపోవడం, పలుమార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. అయితే ఈ వ్యాధి వ్యాప్తిని రష్యా కమాండర్లు పట్టించుకోవడం లేదని వెల్లడించింది. యుద్ధంలో పాల్గొనకుండా ఉండటానికి సైనికులు దీనిని సాకుగా చూపుతున్నారని వారు భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. మొదట్లో ఇది సాధారణ ఫ్లూలా కనిపిస్తుందని, తర్వాత ఇది సైనికుల పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది.

భారత్‌ చంద్రుడిని చేరుకుంటే.. పాక్‌ నేలపై ఎదగలేకపోతోంది

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం మొదలై 22 నెలలు అవుతోంది. ఈ యుద్ధం ముగింపు కోసం ఎలాంటి చర్చలు జరగడం లేదు. తాను చర్చలకు సుముఖంగానే ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యలు చేసినా.. ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ నుంచి మాత్రం భిన్నమైన స్పందన వచ్చింది. ‘చర్చలకు అవసరమైన పరిస్థితులు ఏమీ లేవని మేం భావిస్తున్నాం’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఇదివరకు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ నివేదిక వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని