Qatar: గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది భారతీయుల విడుదల

Qatar: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

Updated : 12 Feb 2024 11:19 IST

దిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. 18 నెలలుగా వీరు అక్కడి జైల్లో ఉన్నారు. వీరికి విధించిన మరణ దండనను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. ఏడుగురు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

‘‘దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఖతార్‌లో అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరి విడుదలకు వీలుగా ‘ఎమిర్ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌’ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ సోమవారం తెల్లవారుజామున ప్రకటన విడుదల చేసింది.

ఇదీ నేపథ్యం..

గూఢచర్యం ఆరోపణల కింద ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని 2022లో ఖతార్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న మన విదేశాంగ శాఖ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్‌కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది.

మోదీ వల్లే సాధ్యమైంది..

భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని దిల్లీకి చేరుకున్న నేవీ మాజీ అధికారులు అన్నారు. సోమవారం తెల్లవారుజామున విమానాశ్రయానికి చేరుకున్న వారు ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలు చేశారు. ‘‘ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన వ్యక్తిగత జోక్యం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి కూడా నా కృతజ్ఞతలు’’ అని ఓ అధికారి అన్నారు.

‘‘మోదీ జోక్యం చేసుకొని ఖతార్‌ ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపడం వల్లే మేం ఈరోజు మీ ముందున్నాం. ప్రధానికి, ఖతార్‌ ఎమిర్‌కు కృతజ్ఞతలు తెలియజేయడానికి నా దగ్గర మాటల్లేవు. వారిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలే మా విడుదలకు దారితీశాయి’’ అని దిల్లీకి చేరుకున్న నావికాదళ మరో మాజీ అధికారి అన్నారు.

గల్ఫ్‌ దేశమైన ఖతార్‌లో లక్షల సంఖ్యలో భారతీయులు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. భారత్‌ పెద్ద ఎత్తున ఎల్‌ఎన్‌జీని అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటోంది. దోహాకు గణనీయంగా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే ఆరోపణలపై.. గతంలో సౌదీ, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ దేశాలు ఖతార్‌కు దారితీసే జల, వాయు, భూమార్గాలను దిగ్బంధించాయి. ఆ కష్ట సమయంలో కూడా మనదేశం నిర్మాణ సామగ్రి, ఆహార సరఫరాలో దోహాకు లోటు చేయలేదు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకార రంగ ఒప్పందాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని