ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో విజయం మీదే!

రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ మొదలైన కేంద్రప్రభుత్వ విభాగాలూ, శాఖల్లో ఇంజినీరింగ్‌ అధికారులుగా విధులు నిర్వర్తించాలనేది మీ లక్ష్యమా? అయితే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌  ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ)లో ప్రతిభ చూపిస్తే మీ ఆకాంక్ష నెరవేరుతుంది.

Updated : 14 Sep 2023 01:10 IST

రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ మొదలైన కేంద్రప్రభుత్వ విభాగాలూ, శాఖల్లో ఇంజినీరింగ్‌ అధికారులుగా విధులు నిర్వర్తించాలనేది మీ లక్ష్యమా? అయితే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌  ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ)లో ప్రతిభ చూపిస్తే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. మనదేశంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే పరీక్ష ఇది. దీని నోటిఫికేషన్‌ ఇటీవలే వెలువడింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసెస్‌లో 167 ఖాళీలు భర్తీచేయనున్నారు. ఈఎస్‌ఈలో విజయం సాధించాలంటే ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!

జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ లాంటి గ్రూప్‌-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ప్రతి సంవత్సరం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఈఎస్‌ఈను నిర్వహిస్తుంది. మూడంచెల పరీక్ష, తుది ఎంపిక తర్వాత సెంట్రల్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, మిలిటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌, సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ పవర్‌, నేవల్‌, బోర్డర్‌ రోడ్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ టెలికమ్యూనికేషన్‌ సర్వీసెస్‌, జూనియర్‌ టెలికాం ఆఫీసర్‌, ఇండియన్‌ రేడియో రెగ్యులేటర్‌ సర్వీసెస్‌ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.

ఇందులో ఉద్యోగం పొందినవారికి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత, రెగ్యులర్‌ ప్రమోషన్‌లతో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంతృప్తి లభిస్తుంది. ఇంజినీరింగ్‌ సర్వీస్‌ సాధిస్తే 7వ పే కమిషన్‌తో మొదటి నెల జీతమే సుమారు రూ. లక్ష వరకూ ఉంటుంది.


ఎవరు అర్హులు?

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ/ సమాన అర్హత, ఎంఎస్సీ/తత్సమానం. ప్రతిపాదించిన మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.

వయసు: పరీక్ష రాసే సంవత్సరపు జనవరి 1వ తేదీకి 21 నుంచి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు గరిష్ఠ   వయసులో సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 26, 2023.

వెబ్‌సైట్‌:www.upsconline.nic.in

ప్రిలిమినరీ/స్టేజ్‌ -1 పరీక్ష తేదీ: 18.2.2024.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ప్రిలిమ్స్‌: 1.హైదరాబాద్‌ 2.విశాఖపట్నం 3.తిరుపతి.  మెయిన్స్‌: 1.హైదరాబాద్‌ 2.విశాఖపట్నం


విజయ సాధనకు వ్యూహం

ఎస్‌ఈ సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌లోని ఏయే అంశాల్లో బలంగా ఉన్నామో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి.

  • తగిన ప్రామాణిక పాఠ్య పుస్తకాలు / అధ్యయన సామగ్రి (స్టడీ మెటీరియల్‌) ఎంచుకోవడం చాలా ముఖ్యం.
  • ఈఎస్‌ఈ ప్రశ్నపత్రాల విషయానికి వస్తే.. సిలబస్‌ పరిధి చాలా విశాలం. ప్రశ్నలు 20 నుంచి 25 శాతం సులభం, మధ్యస్థం. 20 నుంచి 25 శాతం కొంత కఠినంగా ఉంటాయి.
  • సన్నద్ధత ప్రణాళికను ఈ ప్రశ్నలకు అనుగుణంగా రూపొందించుకోవాలి.
  • గత కొద్ది సంవత్సరాల నుంచి ఆచరణాత్మకమైన (ప్రాక్టికల్‌) ప్రశ్నలు చేర్చడం వల్ల ప్రశ్నపత్రంలో కఠినత్వం పెరిగింది. ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే.  
  • అభ్యర్థులు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో బేసిక్స్‌పై ఎంతో కొంత అవగాహన సాధించి ఉంటారు. ఈఎస్‌ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగా బేసిక్స్‌పై పట్టు సాధించాలి.
  • సాధారణంగా అభ్యర్థులు తమకు నచ్చిన అధ్యాయాలను చదవడానికి సుముఖంగా ఉంటారు. కానీ ఈ పరీక్షలో వెయిటేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధ్యాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.
  • క్లిష్టతరమైన, సాధారణ, అతిసాధారణమైన అంశాలకు సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.
  • సబ్జెక్టుపరంగా తమ స్థాయిని బట్టి సొంతంగా ప్రిపేర్‌ కావాలా, కోచింగ్‌ తీసుకోవాలా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
  • ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు పేపర్లలో కనీస క్వాలిఫైయింగ్‌ మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది.
  • కన్వెన్షనల్‌ ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఉంటాయి. కాబట్టి చదవడంతోపాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి.
  • క్వశ్చన్‌ కమ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ విధానం ప్రవేశపెట్టడం వల్ల సమాధానాలు రాయడానికి నిర్ణీత స్థలాన్ని కేటాయించారు. అందువల్ల వీలైనంత సూటిగా జవాబు రాయడం మంచిది.
  • ప్రాథమిక అంశాల ప్రిపరేషన్‌ తర్వాత గత ఈఎస్‌ఈ, గేట్‌, సివిల్‌ సర్వీసెస్‌, ఇతర స్టేట్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాలపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అవగతం అవుతుంది.
  • పునశ్చరణ అనేది అత్యంత కీలకం. చదివిన ప్రతీ అంశాన్నీ   తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి.
  • ఆన్‌లైన్‌లో నిర్వహించే మాక్‌టెస్టులు రాయడం, నమూనా ప్రశ్న పత్రాల సాధన అవసరం. దీనివల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
  • చాప్టర్‌వైజ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్టులు రాసేటప్పుడు, నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలకు తప్పుగా సమాధానం రాసే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రతి ప్రశ్ననూ సవరించుకుని, వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి.  
  • ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు ఎక్కువగా, సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల అందుబాటులో ఉన్న పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించామనేది ముఖ్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని