ఉద్యోగార్థులకు ఐడీబీఐ ఆహ్వానం!

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీవిద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

Updated : 27 Nov 2023 06:48 IST

2100 కొలువులు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ
విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

డీబీఐ పోస్టులకు జనరల్‌ అభ్యర్థులు పోటీ పడటానికి గరిష్ఠ వయసు 25 ఏళ్లు మాత్రమే. ఐబీపీఎస్‌ ద్వారా జరిగే బ్యాంకు పీవో పోస్టులకు మాత్రం అన్‌ రిజర్వ్‌డ్‌ వర్గాలకు 30 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పరీక్షకు పోటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్‌ పరీక్ష కూడా లేకపోవడం కలిసొచ్చే అంశమే. ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అయితే వీరి పనితీరు ప్రకారం రెండేళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవచ్చు. రెండు పోస్టులకూ.. ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ప్రి రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు మాత్రం ఇంటర్వ్యూ అదనం.

ఆన్‌లైన్‌ పరీక్ష

రెండు పోస్టులకూ పరీక్ష విధానం ఒక్కటే. మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌లో 60, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ విభాగంలో 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన లేదు.

ఇంటర్వ్యూ, తుది ఎంపిక

ఆన్‌లైన్‌ పరీక్షలో సెక్షన్లవారీ, మొత్తం మీద కనీస మార్కులు పొందాలి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంతమందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది.

ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 మార్కులు రావాలి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులు పొందినవారు పరీక్షలో సాధించిన మార్కుల్లో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు మార్కులు కలిపి మెరిట్‌ జాబితా రూపొందించి, ఉద్యోగానికి తీసుకుంటారు.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు మాత్రం పరీక్షలో చూపిన ప్రతిభతో ధ్రువ పత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.  

వేతనం

జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’కు ఎంపికైనవారికి క్లాస్‌ ఏ సిటీలో అయితే ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షలు అందుతుంది. వీరు ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. మూడేళ్ల సర్వీస్‌తో గ్రేడ్‌ ‘ఏ’ హోదా పొందుతారు. అదే ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌లో చేరినవారికి మొదటి ఏడాది ప్రతి నెలా రూ.29,000, రెండో ఏట రూ.31,000 చొప్పున చెల్లిస్తారు. అయితే రెండేళ్ల సేవలు అనంతరం వీరిని కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’ పోస్టులకు ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. బ్యాంకు నిర్వహించే ఎంపిక పరీక్షలో విజయవంతమైతే వీరినీ శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్య వివరాలు  

ఖాళీలు: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ 800. (అన్‌ రిజర్వ్‌డ్‌ 324, ఓబీసీ 216, ఎస్సీ 120, ఎస్టీ 60, ఈడబ్ల్యుఎస్‌ 80). ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ 1300. (అన్‌ రిజర్వ్‌డ్‌ 558, ఓబీసీ 326, ఎస్సీ 200, ఎస్టీ 86, ఈడబ్ల్యుఎస్‌ 130).

విద్యార్హత: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు 60 (ఎస్సీ, ఎస్టీలైతే 55) శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

వయసు: నవంబరు 1, 2023 నాటికి 20 - 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే నవంబరు 2, 1998 - నవంబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 6  

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు డిసెంబరు 31. ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులకు డిసెంబరు 30.

ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. మిగిలిన అందరికీ రూ.1000

వెబ్‌సైట్‌ : https://ibpsonline.ibps.in/idbiesonov23/

ఇదీ సిలబస్‌

లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: నాన్‌ వెర్బల్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మన్‌ అవుట్‌, క్లాక్‌, క్యాలెండర్‌, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్‌, డైస్‌, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్‌, పజిల్స్‌, సిలాజిజమ్‌, ర్యాంకింగ్‌, సీక్వెన్స్‌, సింబాలిక్‌ ఆపరేషన్స్‌, నెంబర్‌ ఎనాలజీ, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్‌, నంబర్‌ క్లాసిఫికేషన్‌, సిరీస్‌, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.

జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ: బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల.. ఆర్‌బీఐ, బ్యాంక్‌ పదజాలం, బీమా, రెపో, రివర్స్‌ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు-అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్‌లో ప్రాథమికాంశాలు చదువుతూ, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్‌/ఐటీలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. బ్యాంకు కార్యకలాపాలకు అవసరమయ్యే కనీస సాంకేతిక పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలిస్తారు.  

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్‌, షార్ట్‌ కట్స్‌ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్టు, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌ నుంచి కొన్ని, వ్యాకరణాంశాల నుంచి వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, సిననిమ్స్‌- యాంటనిమ్స్‌, వాయిస్‌, డైరెక్ట్‌, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు.

సన్నద్ధత ఇలా..

  • పరీక్షకు సుమారు 33 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ సమయం ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి మంచి అవకాశం.  
  • ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తాజా అభ్యర్థులు ముందుగా పరీక్షలో పేర్కొన్న విభాగాలకు సంబంధించి ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి అనువైన అంశాలను పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలు అధ్యయనం చేయాలి.
  • పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  • విభాగాల వారీ ఉన్న అంశాలను 23 రోజుల్లో పూర్తిచేసుకోవాలి. చివరి పది రోజులు మాక్‌ టెస్టులకు కేటాయించాలి. ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలనూ బాగా సాధన చేయాలి.  
  • 200 ప్రశ్నలకు 120 నిమిషాలు అంటే ప్రతి ప్రశ్నకూ కేవలం 36 సెకన్ల వ్యవధే ఉంటుంది. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసి, అక్కడ మిగుల్చుకున్న సమయాన్ని ఈ విభాగాలకు కేటాయించగలిగితేనే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు.
  • మాక్‌ టెస్టులతో పరీక్ష విధానానికి అలవాటు పడటమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత వేగంతో సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి.
  • సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే విభాగం/ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే ఎక్కడ తప్పులు చేస్తున్నారో గుర్తించి, వాటిని తర్వాత పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలు, సమయ పాలనపై పట్టు సాధించవచ్చు.
  • రుణాత్మక మార్కులు ఉన్నందున ఏ మాత్రం తెలియని ప్రశ్నను వదిలేయడమే మంచిది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని