వాయుసేనలో చేరే అద్భుత అవకాశం!

రక్షణ రంగంలో అత్యున్నత హోదాను అందించే ఉద్యోగాల్లో ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ముఖ్యమైంది. ఈ పరీక్షలో మెరిసినవారు వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు పొందవచ్చు. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌   విభాగాల్లో రాణించవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. సాధారణ డిగ్రీతో పోటీ పడవచ్చు. తాజా ఏఎఫ్‌ క్యాట్‌-2024(1) ప్రకటన వివరాలు..

Published : 05 Dec 2023 00:27 IST

ఏఎఫ్‌ క్యాట్‌

రక్షణ రంగంలో అత్యున్నత హోదాను అందించే ఉద్యోగాల్లో ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ముఖ్యమైంది. ఈ పరీక్షలో మెరిసినవారు వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు పొందవచ్చు. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌   విభాగాల్లో రాణించవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. సాధారణ డిగ్రీతో పోటీ పడవచ్చు. తాజా ఏఎఫ్‌ క్యాట్‌-2024(1) ప్రకటన వివరాలు..

ఎఫ్‌ క్యాట్‌లో విజయవంతమైతే శిక్షణ తర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఇలా అవకాశం వచ్చినవారు లెవెల్‌-10 హోదాతో రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్‌ అర్హతతో పోటీ పడవచ్చు. చివరి ఏడాది విద్యార్థులు, మహిళలూ అర్హులే. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రకటన వెలువడుతుంది. అందువల్ల దీన్ని లక్ష్యంగా చేసుకున్నవారు గరిష్ఠ వయసు గడువులోపు ఆరేడుసార్లు పరీక్ష రాసుకోవచ్చు. అభ్యర్థులందరికీ దీన్ని ఉమ్మడిగానే నిర్వహిస్తారు.

  • టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాలి.
  • ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించినవారికి స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలెక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష అదనం. వీటిని దాటినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. విభాగాన్ని బట్టి ఇది ఏడాది నుంచి 18 నెలలు కొనసాగుతుంది. శిక్షణ అనంతరం శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో కొనసాగినవారు నిర్ణీత వ్యవధుల్లో దశలవారీ అత్యున్నత హోదాలకు చేరుకుంటారు.  

ఆన్‌లైన్‌ పరీక్ష

దీన్ని 300 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు. ఒక్కో దానికీ మూడు మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు కోత. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ల్లో ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే అడుగుతారు. మిగిలినవి సాధారణ డిగ్రీ స్థాయిలోనే ఉంటాయి. వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాల ద్వారా ప్రశ్నల తీరుపై ఒక అంచనాకు రావచ్చు. అలాగే పరీక్షకు ముందు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులో ఉంచుతారు. గ్రౌండ్‌ డ్యూటీలో టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాలి. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకీ 3 చొప్పున వీటికి 150 మార్కులు.

ఇవీ అంశాలు

జనరల్‌ అవేర్‌నెస్‌: చరిత్ర, భూగోళశాస్త్రం, క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, ముఖ్య వ్యక్తులు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమిక స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. వీటికి సాధారణ అవగాహనతో జవాబులు గుర్తించవచ్చు. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి. వర్తమానాంశాల్లో భాగంగా నియామకాలు, అవార్డులు, క్రీడలు, ఎన్నికల ఫలితాలు, పుస్తకాలు- రచయితలు, రక్షణ రంగంలోని తాజా పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. ఏప్రిల్‌, 2023 నుంచి జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి.

ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్‌, ఎర్రర్‌ డిటెక్షన్‌, సెంటెన్స్‌ కంప్ల్లీషన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, జాతీయాలు, సామెతలు, ఖాళీలు పూరించడం, ఒకాబ్యులరీల నుంచి ప్రశ్నలడుగుతారు. అభ్యర్థికి ఆంగ్ల భాషపై ఏ మేరకు అవగాహన ఉందో ప్రశ్నల ద్వారా పరిశీలిస్తారు. హైస్కూల్‌, ఇంటర్మీడియట్‌ స్థాయి ఆంగ్ల వ్యాకరణాంశాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.  

న్యూమరికల్‌ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, సింపుల్‌ ఇంట్రెస్ట్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు చదివి, మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ స్కోరుకి అవకాశం ఉంది.

రీజనింగ్‌, మిలటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్‌, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ తర్కంతో ముడిపడే ఉంటాయి. బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే ఈ విభాగంలో రాణించవచ్చు.

ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్టు: దీనిలో సంబంధిత బ్రాంచి నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికోసం బీటెక్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి.

స్టేజ్‌ 1, 2  

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. అసైన్‌మెంట్లు, పజిల్స్‌ ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి, విశ్లేషించమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌-2కి వెళ్తారు. స్టేజ్‌-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాన్ని గమనిస్తారు. ఆ తర్వాత ముఖాముఖి ఉంటుంది. ఈ దశలన్నీ దాటినవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైతే శిక్షణకు పిలుస్తారు.

శిక్షణ

జనవరి, 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ విభాగాల్లో 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాలకు 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలలు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్‌ పైలట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్‌, హెలికాప్టర్‌ పైలట్లగా విడదీసి రెండు దశల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఒక్కో దశలో 6 నెలలు చొప్పున దుండిగల్‌, హకీంపేట, బీదర్‌, ఎలహంకల్లో ఈ శిక్షణ కొనసాగుతుంది.

ప్రోత్సాహకాలు

శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం ఉద్యోగంలో రూ.56,100 మూలవేతనం, డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు ఫ్లయింగ్‌, టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ అలవెన్సు అందుతాయి. వీటన్నింటితో ప్రతి నెలా రూ.లక్షకు పైగా వేతనం, ఇతర సౌకర్యాలెన్నో పొందవచ్చు.  


గమనించండి

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: డిసెంబరు 30 రాత్రి 11 గంటలు.
ఫీజు: రూ.550+ జీఎస్‌టీ
పరీక్షలు: ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్‌, వరంగల్‌. ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం.  
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/ 


సన్నద్ధత మెలకువలు

  • సిలబస్‌ వివరాలు క్షుణ్నంగా గమనించాలి. విభాగాలవారీ అందులో పేర్కొన్న ఒక్కో అంశాన్నీ చదవాలి. అనంతరం ఆ అంశంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాలపైనే వస్తున్నాయి. పరీక్షలో విజయానికి వీటిపై పట్టు తప్పనిసరి. ఇందుకోసం 8,9,10 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి.
  • ఏఎఫ్‌క్యాట్‌ వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు, వాటికి సమాధానాలు ఉంచారు. అవి చదవాలి. వీటితోపాటు పాత ప్రశ్నపత్రాలనూ క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వాటి ద్వారా ఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది, ప్రశ్నల సరళి, సన్నద్ధత ఎలా ఉండాలో తెలుసుకుని, ఆచరించాలి.
  • పరీక్షకు ముందు మాక్‌ టెస్టు అందుబాటులో ఉంచుతారు. దాన్ని తప్పనిసరిగా రాయాలి. అలాగే కనీసం ఆరేడు మాక్‌ టెస్టులు రాసి, జవాబులు సరిచూసుకుని, తప్పులను సమీక్షించుకోవాలి.
  • యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్‌ఈ పాత ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగపడతాయి.
  • పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి.

ఏ పోస్టులు? అర్హులెవరు?

ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలిపి 317 ఉన్నాయి. వీటికి ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టులు అదనం.  

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌/ప్లస్‌ 2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.  

వయసు: జనవరి 1, 2025 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 2001 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉంటే మరో రెండేళ్లు మినహాయింపు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల‌్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులు
తప్పనిసరి.

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో.. వెపన్‌ సిస్టం, అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియొరాలజీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. వెపన్‌ సిస్టం ఖాళీలకు ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో 50 శాతం మార్కులతోపాటు ఏదైనా డిగ్రీలో 60 శాతం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ/ బీఎస్సీ (ఫైనాన్స్‌) పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌ ఖాళీలకు ఏదైనా పీజీలో 50, యూజీలో 60 శాతం ఉండాలి. మెటియొరాలజీ విభాగానికి బీఎస్సీ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతో 60 శాతం మార్కులు లేదా నిర్దేశిత బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ అవసరం. అన్ని విభాగాలకూ ఇంటర్మీడియట్‌ చదివుండటం తప్పనిసరి.

వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జనవరి 1, 2025 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1999 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని