త్రివిధ దళాల్లో తిరుగులేని కెరియర్‌!

చిన్న వయసులోనే భారత సైన్యంలో అధికారిగా విధులు నిర్వర్తించాలనుకుంటున్నారా? అయితే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షకు సిద్ధం కండి. త్రివిధ దళాల్లో తిరుగులేని కెరియర్‌ ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఇది ముఖ్యమైంది. ఎంపికైనవారు బీఏ/బీఎస్సీ/బీటెక్‌ ఉచితంగా చదువుకుంటూ, శిక్షణ పొందుతారు.

Updated : 25 Dec 2023 02:20 IST

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ 2024(1) ప్రకటన

చిన్న వయసులోనే భారత సైన్యంలో అధికారిగా విధులు నిర్వర్తించాలనుకుంటున్నారా? అయితే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షకు సిద్ధం కండి. త్రివిధ దళాల్లో తిరుగులేని కెరియర్‌ ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఇది ముఖ్యమైంది. ఎంపికైనవారు బీఏ/బీఎస్సీ/బీటెక్‌ ఉచితంగా చదువుకుంటూ, శిక్షణ పొందుతారు. ఉద్యోగంలో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందుకుంటారు. తక్కువ వ్యవధిలోనే అత్యున్నత స్థాయిని అందించే ఈ పరీక్ష వివరాలు..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షను నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది. నియామక ప్రక్రియ కఠినంగా ఉన్నప్పటికీ 40 శాతం మార్కులు పొందితే ఏదో ఒక సర్వీస్‌ ఖాయమవుతుంది. వీరు నేేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ, పుణేలో.. బీటెక్‌, బీఎస్సీ, బీఏ కోర్సులు, నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో బీటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌) విద్య అభ్యసించవచ్చు. వసతి, భోజనం, బట్టలు...అన్నీ ఉచితమే. విజయవంతంగా చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీ పట్టా అందిస్తుంది. అనంతరం సంబంధిత విభాగాల ట్రేడ్‌ శిక్షణకు పంపుతారు. ఇది సుమారు ఏడాది నుంచి 18 నెలలు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందుతుంది.  

ఉద్యోగంలో..

విధుల్లోకి చేరిన తర్వాత లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 చెల్లిస్తారు. దీనికి అదనంగా మిలిటరీ సర్వీస్‌ పే రూ.15,500 ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు అందరికీ దక్కుతాయి. ఆర్మీలో లెఫ్టినెంట్‌, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాలు కేటాయిస్తారు. ఇవన్నీ సమాన స్థాయివే. రెండేళ్ల అనుభవంతో పదోన్నతి పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో పదోన్నతి దక్కుతుంది. పదమూడేళ్ల అనుభవంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో వరుసగా.. లెఫ్టినెంట్‌ కల్నల్‌, కమాండర్‌, వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు. అనంతరం ప్రతిభ ప్రాతిపదికన మిగిలిన హోదాలు దక్కుతాయి. అత్యున్నత ప్రతిభ చూపినవారు భవిష్యత్తులో సంబంధిత విభాగాలకూ, త్రివిధ దళాలకూ అధిపతి కాగలరు.

ఎంపిక ఇలా

పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. పరీక్షలో రెండు పేపర్ల నుంచి 900 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-1 మ్యాథ్స్‌ 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పేపర్‌-2లో జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 150 ప్రశ్నలు 600 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇందులో పార్ట్‌ ఎ ఇంగ్లిష్‌కు 200, పార్ట్‌ బి జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు. ఇంగ్లిష్‌లో 50, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో.. ఫిజిక్స్‌ 25, కెమిస్ట్రీ 15, జనరల్‌ సైన్స్‌ 10, చరిత్ర, స్వాతంత్య్రోద్యమాలు 20, భూగోళశాస్త్రం 20, వర్తమానాంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు.

పరీక్షలో అర్హతకు సబ్జెక్టులవారీ 25 శాతం మార్కులు పొందాలి. అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి మెరిట్‌ ప్రకారం కొంతమందికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో.. గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్కుల్లో ప్రతిభ చూపాలి. వీటిని రెండంచెల్లో ఐదు రోజులు నిర్వహిస్తారు. తొలిరోజు పరీక్షల్లో అర్హత సాధించినవారికే మిగిలిన నాలుగు రోజుల టాస్క్‌, ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల మెరిట్‌తో తుది నియామకాలుంటాయి. అవకాశం వచ్చినవారికి జనవరి, 2025 నుంచి శిక్షణ, తరగతులు ప్రారంభమవుతాయి.  

గత కటాఫ్‌

2023(1) పరీక్షలో 301 మార్కులతో ఇంటర్వ్యూకు, 664 మార్కులు పొందిన వారు ఏదో ఒక విభాగానికి ఎంపికయ్యారు. 2022(2) పరీక్షలో 900కు 316 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. శిక్షణకు అవకాశం వచ్చిన చివరి అభ్యర్థి పొందిన మార్కులు 678. అంటే పరీక్ష, ఇంటర్వ్యూల్లో 1800కు 40 శాతం (720) మార్కులు పొందినవారు విజయవంతం కావచ్చు.

ఎంపీసీతో సులువు

పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు గరిష్ఠ వయసును పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఆరేడుసార్లు ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ రాసుకోవచ్చు. అందువల్ల దీన్నే లక్ష్యంగా చేసుకుని, శ్రద్ధగా సన్నద్ధమైతే విజయం సాధించగలరు. ఎంపీసీ విద్యార్థులకు కొంత అనుకూలం. అర్ధ భాగం మార్కులు ఈ సబ్జెక్టుల నుంచే ఉంటాయి. పేపర్‌-1లో మ్యాథ్స్‌ 300, పేపర్‌-2లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ 160 మొత్తం 460 మార్కులకు ఎంపీసీ నుంచే ప్రశ్నలొస్తాయి. ఇతర గ్రూపుల విద్యార్థులు ఈ సబ్జెక్టుల్లో మార్కులకు అదనంగా శ్రమించాలి.

ఉపయోగపడే పుస్తకాలు

  • టాటా మెక్‌ గ్రాహిల్స్‌, అరిహంత్‌ పబ్లిషర్ల ఎన్‌డీఏ పుస్తకాల్లో ఏదైనా తీసుకోవచ్చు.
  • లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ జీకే ప్రశ్నలకు ఉపయోగం.
  • మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాఠ్యపుస్తకాలు చాలు.
  • చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్‌ సైన్స్‌ విభాగాల్లోని ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతులతోపాటు ప్లస్‌ 1, 2 పుస్తకాలు.

సన్నద్ధత మెలకువలు

నోటిఫికేషన్‌లో సిలబస్‌ వివరాలు ప్రకటించారు. వాటిని బాగా పరిశీలించి, సీబీఎస్‌ఈ 10, 11, 12 తరగతుల పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. 8,9,10 తరగతుల మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ పాఠ్యపుస్తకాలు చదివి, ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి.  

  •  ప్రతి విభాగం, అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.  
  • పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. వీటిని శ్రద్ధగా గమనించాలి. విభాగాలు, అంశాలవారీ ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధత ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.
  • అధ్యయనం పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు చేస్తోన్న సబ్జెక్టులు/ పాఠ్యాంశాలకు ప్రాధాన్యమివ్వాలి. తర్వాత పరీక్షల్లో అవి పునరావృతం కాకుండా చూడాలి. సన్నద్ధతలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.
  • మాథ్స్‌ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధనతో వేగం, కచ్చితత్వాన్ని అందుకోవచ్చు. ఇబ్బంది పెడుతోన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
  • రుణాత్మక మార్కులున్నందున తెలియని ప్రశ్నలను వదిలేయాలి. సమాధానం కోసం ఎక్కువ సమయం అవసరమయ్యేవాటిని చివరలోనే ప్రయత్నించాలి.
  • పరీక్షకు పది రోజుల ముందు నుంచీ పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ముఖ్యాంశాలను మరోసారి బాగా చదవాలి.

ఏ సబ్జెక్టు.. ఎలా?

  • గణితం: ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్‌లో ప్రశ్నలు 8 అధ్యాయాల నుంచి అడుగుతున్నారు. పాతప్రశ్నపత్రాలు గమనించి ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.  
  • భౌతిక శాస్త్రం: కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. సూత్రాలు, అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి.
  • రసాయనశాస్త్రం: మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై దృష్టి సారించాలి.
  • ఇంగ్లిష్‌: అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. వ్యాకరణం, పదసంపదకు ప్రాధాన్యం. వీలైనన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చగలగాలి. అర్థాలు, వ్యతిరేకాలు, తప్పుని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, కాంప్రహెన్షన్‌, ఖాళీని పూరించడం...వీటిలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.  
  • కరెంట్‌ అఫైర్స్‌: ఈ విభాగంలో ఏప్రిల్‌ 2023 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను రాసుకోవాలి. పరీక్షకు ముందు వాటిని ఒకసారి చదవాలి.

ముఖ్య వివరాలు

  • ఖాళీలు: 400. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో 370, నేవల్‌ అకాడెమీ (10+2 క్యాడెట్‌ స్కీం)లో 30 ఉన్నాయి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో.. ఆర్మీ 208 (10 మహిళలకు), నేవీ 42 (12 మహిళలకు), ఎయిర్‌ఫోర్స్‌ - ఫ్లయింగ్‌ 92 (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ టెక్‌ 18 (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్‌ 10 (2 మహిళలకు) ఉన్నాయి. నేవల్‌ అకాడెమీలోని 30 ఖాళీల్లో 9 మహిళలకు కేటాయించారు.
  • అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌. ఎయిర్‌ఫోర్స్‌, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ) ఖాళీలకు ఎంపీసీ గ్రూపుతో ఇంటర్‌. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: జులై 2, 2005 - జులై 1, 2008 మధ్య జన్మించినవారు అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 9 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
  • ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
  • పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 21.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌, అనంతపురం
  • వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని