ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో అవకాశాలు

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌/ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డ్రైవిండ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Updated : 28 Dec 2023 06:05 IST

చెన్నైలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సదరన్‌ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో జూనియర్‌/ సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌/ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డ్రైవిండ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 20.12.2023 నాటికి 18 నుంచి 30 మధ్య సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, కేటగిరీని బట్టి.. ఏఏఐ ఉద్యోగులు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

అన్‌-రిజర్వుడ్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీ, ఏఏఐలో ఏడాదిపాటు అప్రెంటిషిప్‌ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పోస్టులను బట్టి విద్యార్హతలు, ఎంపిక విధానాలు వేర్వేరుగా ఉన్నాయి.

1. జూనియర్‌ అసిస్టెంట్‌ (ఫైర్‌ సర్వీసెస్‌): 73 ఖాళీలు. పదో తరగతి, మూడేళ్ల రెగ్యులర్‌ మెకానికల్‌/ ఆటోమొబైల్‌/ ఫైర్‌ డిప్లొమా పాసవ్వాలి. లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద ఈ పోస్టులను ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు
కేటాయించారు.

  • హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి/ ఈ ఉద్యోగ ప్రకటనకు ఏడాది ముందు నుంచీ మీడియం వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. లేదా ఈ ఉద్యోగ ప్రకటనకు రెండేళ్ల ముందు నుంచీ లైట్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. టెంపరరీ, లెర్నింగ్‌ లైసెన్స్‌లను అనుమతించరు. )్ల  అభ్యర్థులకు దృష్టి, వినికిడి సమస్యలు ఉండకూడదు.
  • పురుష అభ్యర్థుల ఎత్తు 167 సెం.మీ. ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. బరువు 55 కేజీలు ఉండాలి.
  • మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ., బరువు 45 కేజీలకు తక్కువ కాకుండా ఉండాలి.

ఎంపిక: స్టేజ్‌-1లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. వ్యవధి 2 గంటలు. దీంట్లో యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

  • పార్ట్‌-1లో 50 శాతం ప్రశ్నలు బేసిక్‌ మ్యాథమెటిక్స్‌, బేసిక్‌ సైన్స్‌, ఎలిమెంటరీ ఇంగ్లిష్‌/ గ్రామర్‌ల నుంచి ఉంటాయి. ప్రశ్నపత్రం 10వ తరగతి స్థాయిలో ఉంటుంది.
  • పార్ట్‌-బిలో 50 శాతం ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి అడుగుతారు. ప్రశ్నలు 12వ తరగతి స్థాయిలో ఉంటాయి.

స్టేజ్‌-2: సీబీటీ పాసైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీంట్లో పాసైతే డ్రైవింగ్‌, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌: దీంట్లో భాగంగా.. 100 మీటర్ల రన్నింగ్‌, రోప్‌, పోల్‌ క్లైంబింగ్‌, హ్యూమన్‌ డమ్మీతో 60 మీటర్ల రన్నింగ్‌, నిచ్చెన ఎక్కడం ఉంటాయి. ప్రతి టెస్ట్‌కూ 20 మార్కులు.
2. జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌): 2 పోస్టులు. డిగ్రీ పాసవ్వాలి.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు. రాత పరీక్షలో పాసైన అభ్యర్థులకు ఎంఎస్‌-ఆఫీస్‌లో కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు.

  • 50 శాతం ప్రశ్నలు విద్యార్హతల సబ్జెక్టులకు సంబంధించినవి ఉంటాయి.
  • జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌లో 50 శాతం ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. వీరు సీబీటీలో 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.

3. సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 25 ఖాళీలు. ఎలక్ట్రానిక్స్‌/ టెలికం/ రేడియో ఇంజినీరింగ్‌ డిప్లొమా, సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు.

  • విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు అడుగుతారు. 
  • నరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి 30 శాతం ప్రశ్నలు ఇస్తారు. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

4. సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): 19 పోస్టులు. బీకామ్‌ పాసై.. రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ తయారీ, ట్యాక్సేషన్‌, ఆడిట్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ రంగాల్లో పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షకు 100 మార్కులు. వ్యవధి 2 గంటలు. ఎంఎస్‌-ఆఫీస్‌లో కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ ఉంటుంది. సీబీటీలో అర్హత సాధించినవారికి కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

  • విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు ఇస్తారు.
  • 30 శాతం ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి అడుగుతారు. 
  • యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

సన్నద్ధత

సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. గతంలో చదివిన సబ్జెక్టులేనని నిర్లక్ష్యం చేయకుండా వాటిపై పట్టుసాధించడానికి ప్రయత్నించాలి.

  • జీకే, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ల కోసం పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మాక్‌ టెస్టులు రాయడం వల్లా ప్రయోజనం ఉంటుంది.
  • నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి ముందుగా తెలిసిన ప్రశ్నలు జవాబులు రాసి.. ఆ తర్వాత కాస్త ఆలోచించి తెలియనివాటికీ సమాధానాలు రాయాలి.
  • నిర్ణీత సమయంలోగా సమాధానాలు రాయడం సాధన చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.01.2024
వెబ్‌సైట్‌: http://www.aai.aero/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని