నేవీలో చేరతారా?

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునేఅవకాశం వచ్చింది. 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటన వెలువడింది.

Updated : 11 Jan 2024 02:23 IST

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునేఅవకాశం వచ్చింది. 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటన వెలువడింది. అమ్మాయిలూ దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ ర్యాంకు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఇందులో అవకాశం వచ్చినవారికి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితంగానే దక్కుతాయి. చదువు, శిక్షణ పూర్తయిన వెంటనే విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే రూ.లక్ష కంటే ఎక్కువ వేతనం అందుతుంది.

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు నేవీ 10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌లో ర్యాంకు తప్పనిసరి. అందులో సాధించిన ర్యాంకుతో మెరిట్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంత మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్‌, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా మార్చి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి.

తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో నెగ్గినవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు.  

జులైలో శిక్షణ

ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జులై 2024 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు...అన్నీ ఉచితంగా అందిస్తారు.

విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) - న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

అనంతరం వీరు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ కేటాయిస్తారు. వీరికి లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 అదనంగా దక్కుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.లక్ష కంటే ఎక్కువే వేతన రూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు.. ఇలా ప్రోత్సాహకాలు పొందవచ్చు. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు లభిస్తాయి.

ముఖ్య వివరాలు

ఖాళీలు: మొత్తం 35. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌) విభాగాల్లో ఉన్నాయి. కనీసం పది పోస్టులు మహిళలతో నింపుతారు.
విద్యార్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌-2023లో ర్యాంకు పొందాలి. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వయసు: జనవరి 2, 2005 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని