NEET UG 2024: నీట్‌ (యూజీ) దరఖాస్తులకు ఎన్‌టీఏ మరో అవకాశం

నీట్‌ (యూజీ) పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు ఎన్‌టీఏ మరో ఛాన్స్‌ ఇచ్చింది. 

Updated : 08 Apr 2024 20:10 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) (NEET UG 2024) పరీక్షకు పలు కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు శుభవార్త. అలాంటి విద్యార్థులందరికీ మరో అవకాశం కల్పిస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఓ నిర్ణయం తీసుకుంది. గత నెలలోనే దరఖాస్తుల స్వీకరణ, కరెక్షన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ తాజాగా రిజిస్ట్రేషన్ల విండోను రీఓపెన్‌ చేయడం విశేషం. పలువురు విద్యార్థుల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 9 నుంచి 10వ తేదీ రాత్రి 10.50 గంటల వరకు విద్యార్థులు అప్లై చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఇది ఒకే ఒక్క అవకాశమని.. జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ లింక్‌పై క్లిక్‌ చేసి మంగళవారం నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ కీలక ప్రకటన.. పలు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా

ఇదిలాఉండగా.. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. ఈ పరీక్షకు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానం (ఆఫ్‌లైన్‌)లో జరగనుంది. ఈసారి నీట్‌ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం    ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని