UGC: నాలుగేళ్ల డిగ్రీతో ఇకపై నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు: యూజీసీ ఛైర్మన్‌

నాలుగేళ్ల డిగ్రీతో ఇక నుంచి పీహెచ్‌డీ నేరుగా చేయవచ్చని యూజీసీ ప్రకటించింది.

Published : 21 Apr 2024 20:45 IST

దిల్లీ: పీహెచ్‌డీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) కీలక నిర్ణయం ప్రకటించింది. యూజీసీ నెట్‌ (జూన్‌) సెషన్‌ పరీక్షలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. నాలుగేళ్ల పాటు అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా యూజీసీ నెట్‌ పరీక్ష రాసేందుకు అర్హులని, తద్వారా వారు పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా, లేకపోయినా పీహెచ్‌డీ అభ్యసించేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌లు ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పటివరకు మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి 55శాతం మార్కులు ఉన్న అభ్యర్థులను మాత్రమే నెట్‌కు అర్హులుగా పరిగణించేవారు. 

యూజీసీ నెట్‌ (జూన్‌) నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

తాజా నిర్ణయంతో ఇకపై నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కలిగిన వారు నేరుగా యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష రాసి పీహెచ్‌డీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు యూజీసీ ఛైర్మన్‌ తెలిపారు. ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, ఇందుకోసం వారు నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్‌ క్రిమీ లేయర్‌), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుందన్నారు. యూజీసీ ఎప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల నాలుగేళ్ల డిగ్రీ పూర్తయినవారితో పాటు ప్రస్తుతం ఎనిమిదో సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్‌ (జూన్‌ సెషన్‌)కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరోవైపు, యూజీసీ నెట్‌ (జూన్‌) సెషన్‌కు సంబంధించి శనివారం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని