TSPSC: గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలొచ్చేశాయ్‌..

తెలంగాణలో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి.

Updated : 06 Mar 2024 16:27 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న గ్రూప్‌- 1 గ్రూప్‌-2, గ్రూప్‌- 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. 563 ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌కు సంబంధించి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది.

అలాగే, మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇకపోతే, 1,388 గ్రూప్‌ -3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్‌- 1 ఉద్యోగాలకు మార్చి 14వరకు దరఖాస్తులు స్వీకరణ కొనసాగనుండగా.. గ్రూప్‌ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది, గ్రూప్‌ 3 పోస్టులకు సైతం 5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని