అప్పుల ‘మే’ళం

రాష్ట్రం ఒక్క మే నెలలోనే రూ.9,500 కోట్ల రుణం సమీకరించింది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో రూ.28వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో మూడో వంతు ఒక్క నెలలోనే అప్పుగా సమీకరించడం చర్చనీయాంశమవుతోంది. రమారమి నెలకు రూ.2,300 కోట్ల చొప్పున ఆ అప్పు సమీకరిస్తే ఏడాది మొత్తానికి సమంగా వాడుకున్నట్లవుతుంది. దీనికి భిన్నంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే నెలలో ఈ స్థాయి రుణాన్ని రాష్ట్రం తీసుకుంది. ఇంకా చెప్పాలంటే..

Updated : 31 May 2022 10:17 IST

ఒకే నెలలో రూ.9,500 కోట్ల అప్పు
ఈ స్థాయి రుణం ఎన్నడూ లేదు
అనుమతిచ్చిన దాంట్లో మూడో వంతు పూర్తి
ఈనాడు - అమరావతి

రాష్ట్రం ఒక్క మే నెలలోనే రూ.9,500 కోట్ల రుణం సమీకరించింది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్లో రూ.28వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో మూడో వంతు ఒక్క నెలలోనే అప్పుగా సమీకరించడం చర్చనీయాంశమవుతోంది. రమారమి నెలకు రూ.2,300 కోట్ల చొప్పున ఆ అప్పు సమీకరిస్తే ఏడాది మొత్తానికి సమంగా వాడుకున్నట్లవుతుంది. దీనికి భిన్నంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే నెలలో ఈ స్థాయి రుణాన్ని రాష్ట్రం తీసుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఒక నెలలో రాష్ట్రం సొంత పన్నుల, పన్నేతర ఆదాయం కన్నా రుణం ఎక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారం.. రాష్ట్ర పన్నుల రాబడి రూ.73,689.77 కోట్లు. పన్నేతర రాబడి రూ.5,451.20 కోట్లు. ఈ రెండు కలిపి చూసి నెలకు వచ్చే రాబడిని లెక్కిస్తే కేవలం రూ.6,595 కోట్లుగా తేలుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ లెక్కల్లో పన్ను, పన్నేతర రాబడిని రూ.1,02,142 కోట్లుగా లెక్కించింది. ఆ రూపేణా చూసినా రాష్ట్రానికి నెలకు సొంతంగా వచ్చే పన్నులు, పన్నేతర రాబడి రూ.8,511 కోట్లే. గతంలో అత్యధికంగా నెలకు రూ.5,000 కోట్లను ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు సమీకరించిన ఉదంతాలున్నాయి. రాష్ట్ర జీఎస్‌డీపీలో 4% బహిరంగ మార్కెట్‌ రుణపరిమితికి అనుమతినివ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంటోంది. అన్ని రుణాలు కలిపినా ఈ స్థాయి మించకూడదనే నిబంధన విధించింది. రాష్ట్రాలు అర్హత, పరిమితికి మించి రుణభారంలో కూరుకుపోతున్నాయనే పరిస్థితుల మధ్య కేంద్ర వ్యయ విభాగం రుణాలకు పరిమితినిచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. తనకున్న అవకాశాల మేరకు రూ.61వేల కోట్ల వరకు అప్పులు తీసుకునే వెసులుబాటు ఉందని కేంద్రం ముందు ఏపీ వాదించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించకుండా కేవలం రూ.28వేల కోట్లకే అనుమతులివ్వడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని