‘ఎయిమ్స్‌’కు చుక్కలు చూపిస్తున్నారు

పేదలకు ఉన్నత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే ప్రసంగాలు చేస్తుంటారు. విభజన అనంతరం రాష్ట్రంలో పెద్దాసుపత్రులు లేకుండా పోయాయని

Published : 26 Sep 2022 03:06 IST

సరిపడా నీటి సరఫరాకు ప్రభుత్వ కొర్రీలు

ఖర్చులు భరించాలని స్పష్టీకరణ

నీళ్లు లేకనే వైద్య సేవల విస్తరణకు ఆటంకం

కేంద్రం లేఖ రాసినా పట్టించుకోని రాష్ట్రం

ఈనాడు - అమరావతి

పేదలకు ఉన్నత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే ప్రసంగాలు చేస్తుంటారు. విభజన అనంతరం రాష్ట్రంలో పెద్దాసుపత్రులు లేకుండా పోయాయని తరచూ వాపోతుంటారు. ఆరోగ్యశ్రీని పక్కాగా అమలు చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్నామని చెబుతుంటారు. కానీ... మంగళగిరిలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌కు దైనందిన అవసరాలకు తగినట్లుగా నీటిని అందించలేకపోతున్నారు. సరఫరా ఖర్చును భరించాలని కూరగాయల మాదిరిగా బేరాలు సాగిస్తూ ఆసుపత్రికి చుక్కలు చూపిస్తున్నారు. కాకినాడ నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల రోగులకు ఎంతగానో ఉపయోగపడే ఎయిమ్స్‌లో తగిన నీటి వసతి లేని కారణంగా ఇన్‌పేషంట్లను ఎక్కువ సంఖ్యలో చేర్చుకోలేని దుస్థితి నెలకొనడం విస్మయానికి గురిచేస్తోంది.

మంగళగిరిలో రూ.1,618 కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌ నిర్మాణానికి 2015 డిసెంబరులో శంకుస్థాపన జరిగింది. 2019 మార్చి 12 నుంచి సేవలు మొదలయ్యాయి. అత్యాధునిక నిర్మాణాలు, వసతులతో రూపుదిద్దుకుంటున్న ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి రోజుకు 15-20 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 2-3 లక్షల లీటర్లను మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు ఉచితంగా అందిస్తున్నారు. ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రికి తెచ్చేందుకు నెలకు రూ.5 లక్షల ఖర్చును ఎయిమ్స్‌ భరిస్తోంది. ఓపీ ద్వారా రోజూ 1,500 మంది వరకు వైద్యం పొందుతున్నారు. 950 వరకు ఇన్‌పేషంట్‌ పడకల ఏర్పాటుకు అవకాశముంది.

అయితే... 125 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణాలకు తగ్గట్లు 400 పడకలను అదనంగా వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుంది. ఎంబీబీఎస్‌లోనూ సీట్లు పెరిగాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి పీజీ, నర్సింగ్‌లోనూ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా రోజు మరో 3 లక్షల లీటర్ల నీటిని అదనంగా ఇవ్వాలని ఎయిమ్స్‌ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వైద్యారోగ్యశాఖ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ కమిషనర్ల స్థాయి వరకు కొద్దికాలంగా లేఖలు రాస్తూనే ఉన్నారు. అదనంగా 3 లక్షల లీటర్ల నీటిని మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెలుపలి (విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌) నుంచి ఇవ్వాల్సి ఉన్నందున చెల్లింపులు జరగాల్సిందేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తొలుత పేర్కొన్నట్లు రోజుకి రూ.72,162 కాకున్నా... కనీసం సాధారణ స్థాయిలోనైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం రోజుకి రూ.35వేల వరకు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి వస్తుందని తెలిసింది. ఈలెక్కన చెల్లింపులు జరిపి, నీటిని మంగళగిరి ఎయిమ్స్‌కు ట్యాంకర్ల ద్వారా తెప్పించేందుకు నెలకు అదనంగా మరో రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా.

కేంద్ర మంత్రుల విస్మయం

రాష్ట్రానికి ఎయిమ్స్‌ వస్తుంటే... రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికి.. అవసరమైన నీరు, రోడ్డు, ఇతర కనీస సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రులు భారతీ పవార్‌, నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎయిమ్స్‌ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అదనంగా మరో 3 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా అందచేయాలి’ అని కేంద్ర మంత్రి మాండవీయ 2022 జులై 28న ముఖ్యమంత్రి జగన్‌కు స్వయంగా లేఖ రాశారు. అయితే... ‘ఉచితంగా నీటిని ఇవ్వలేం. ధర మాత్రం తగ్గిస్తాం’ అని 2022 సెప్టెంబరు 2న పురపాలకశాఖ చెప్పడం గమనార్హం.

ముచ్చటగా... 3 ప్రతిపాదనలు

ఎయిమ్స్‌కు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరిగితేనే సమస్య పరిష్కారమైనట్లు లెక్క. తెనాలి రోడ్డులోని మంగళగిరి ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నుంచి నీరిచ్చేందుకు 2018లో తొలి ప్రతిపాదన చేశారు. భవిష్యత్తులో మంగళగిరికి నీటి సమస్య వస్తుందన్న అభ్యంతరాలతో అది మరుగునపడింది. ఉండవల్లి నుంచి తెనాలి వరకున్న పైపులైను నుంచి నీటిని తీసుకోవాలనే రెండో ప్రతిపాదన తెచ్చారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనా కనుమరుగైంది. చివరికి... మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆత్మకూరు సమీపంలోని 80 ఎకరాల చెరువు నుంచి నీటిని తరలించేందుకు టెండరు పిలిచారు. త్వరలో సంస్థను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌ ప్రాంగణానికి వచ్చే మార్గంలో 0.42 హెక్టార్ల అటవీ భూమిని ఎయిమ్స్‌కు ఇంకా బదలాయించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని