రానున్న నాలుగు రోజుల్లో వడగాలులు తీవ్రతరం

దక్షిణ, నైరుతి దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి.

Published : 29 Apr 2024 05:13 IST

నందికొట్కూరు, చాపాడులో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: దక్షిణ, నైరుతి దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మే 1న రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగేందుకు అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైయస్‌ఆర్‌ జిల్లా చాపాడులో 45.9, కర్నూలు జిల్లా గూడూరులో 45.5, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 45.1, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 68 మండలాల్లో తీవ్ర వడగాలులు, 120 మండలాల్లో వడగాలులు వీచాయి. సోమవారం 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీచవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని