Gopal Snacks IPO: 6న గోపాల్‌ స్నాక్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.381-401

Gopal Snacks IPO: రూ.650 కోట్ల సమీకరణ లక్ష్యంతో గోపాల్‌ స్నాక్స్‌ ఐపీఓ మార్చి 6-11 మధ్య రానుంది.

Published : 01 Mar 2024 14:44 IST

ముంబయి: గోపాల్ స్నాక్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ మార్చి 6-11 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని రూ.381-401గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.650 కోట్లు సమీకరించనున్నారు. ఈ పబ్లిక్‌ ఇష్యూలో ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రాతిపదికన జరగనుంది. దీంతో ఈ ఐపీఓలో సమకూరిన నిధులు కంపెనీకి చెందబోవు.

1999లో రాజ్‌కోట్‌ కేంద్రంగా గోపాల్‌ స్నాక్స్‌ను స్థాపించారు. భారత్‌ సహా అంతర్జాతీయంగా నమ్‌కీన్‌, వెస్టర్న్‌ స్నాక్స్‌ వంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. 2023 సెప్టెంబరు నాటికి 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు డిపోలు, 617 పంపిణీ కేంద్రాలున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, మోడాసాలో; మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తయారీ కేంద్రాలున్నాయి. అనుబంధంగా మరో మూడు కేంద్రాలు పనిచేస్తున్నాయి.

‘సూర్యఘర్‌’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?

2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,128.86 కోట్లుగా ఉన్న కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2023 నాటికి రూ.1,394.65 కోట్లకు చేరింది. లాభం రూ.21.12 కోట్ల నుంచి రూ.112.37 కోట్లకు పెరిగింది. ఐపీఓలో అందుబాటులో ఉన్న మొత్తం షేర్లలో దాదాపు సగం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించారు. కనీసం రూ.14,837తో 37 షేర్లు (ఒక లాట్‌) సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌ వ్యవహరిస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని