హోమ్‌లోన్‌ కస్టమర్లకు ఆర్‌బీఐ ఊరట.. ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లకు మారేందుకు అవకాశం!

Relief to Home loan barrowers: హోమ్‌లోన్‌ వినియోగదారులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్ల విధానానికి మారే అవకాశం కల్పించనుంది.

Updated : 10 Aug 2023 15:37 IST

ముంబయి: గృహ రుణ వినియోగదారులకు (Home loan) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్ల విధానంలోకి మారే అవకాశం తీసుకురానుంది. దీనికి సంబంధించి ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొస్తామని తెలిపింది. కేవలం హోమ్‌లోన్‌ కస్టమర్లే కాకుండా వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారూ ఈ విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. ఎంపీసీ భేటీ నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

కీలక వడ్డీరేట్లు యథాతథమే

సాధారణంగా వడ్డీ రేట్ల పెరిగినప్పుడు రెగ్యులేటెడ్‌ బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు ఈఎంఐలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాలవ్యవధిని సవరిస్తుంటాయి. ఈ విషయంలో రుణ గ్రహీతకు ఎలాంటి సమాచారం ఇవ్వవు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇదే విషయాన్ని తాము చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడించారని ఆర్‌బీఐ తెలిపింది. ఫ్లోటింగ్‌ వడ్డీ విధానంలో బ్యాంకులు తమ వద్ద నుంచి ఎలాంటి సమ్మతి లేకుండానే నిర్ణయం తీసుకుంటున్నాయని వారు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొంది. దీనికి పరిష్కారంగా ఆయా ఆర్థిక సంస్థలు అమలు చేసే విధంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురాబోతున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు.

యూపీఐ లైట్‌ లిమిట్‌ పెంపు.. ఇకపై 500 వరకు పాస్‌వర్డ్‌ అక్కర్లేదు

ఈ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం.. రుణ కాల వ్యవధి లేదా ఈఎంఐలో మార్పులు చేసేటప్పుడు సంబంధిత సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియజేయాలి. అలాగే, ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్‌డ్‌ విధానానికి మారేందుకు అవకాశం ఇవ్వడం లేదా ముందస్తు చెల్లింపులకు రుణ గ్రహీతకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ల అమలుకు సంబంధించి వివిధ ఛార్జీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రుణ గ్రహీతకు ఆయా ఛార్జీల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుందని శక్తికాంత దాస్‌ చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని