AP News: చర్చిద్దాం రండి.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు
అమరావతి: పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఇందుకోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం సమావేశ మందిరంలో కార్యదర్శుల కమిటీ సమావేశం అవుతుందని అందులో పేర్కొన్నారు. పీఆర్సీ నివేదికతో పాటు డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల వంటి అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. డిసెంబరు 10లోగా పీఆర్సీపై ఓ స్పష్టత ఇస్తామంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వటంతో ఆ దిశగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
మరో వైపు ఏపీ ఎన్జీవోల నేతృత్వంలోని ఏపీ జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్ నేతృత్వంలోని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కూడా రెండు రోజుల క్రితం ఉద్యమ కార్యాచరణ నోటీసును సీఎస్కు ఇచ్చింది. డిసెంబరు 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిలుపురావటంతో చర్చించాల్సిన అంశాలపై ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.